Kalvakuntla Kavitha: తెలంగాణ ప్రభుత్వంపై, అలాగే ప్రతిపక్ష బిఆర్ఎస్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలను ప్రతిపక్షం బహిష్కరించడం తీవ్రమైన తప్పిదమని, ఇది అధికార కాంగ్రెస్ ప్రభుత్వం తన అబద్ధాలను, తప్పుదోవ పట్టించే ప్రకటనలను యథేచ్ఛగా ప్రచారం చేసుకోవడానికి వరంగా మారిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆదివారం సూర్యాపేటలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నా ప్రభుత్వం, ప్రతిపక్షం రాజకీయ నాటకాల్లో మునిగిపోయాయని మండిపడ్డారు.
తెలంగాణ నీటి వాటాలో 3 శాతాన్ని తగ్గించేందుకు ఎవరు ఆమోదం తెలిపారో ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి, నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాలకు నీటి కేటాయింపులను ఎందుకు కుదించారో వివరించాలని ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు. ముఖ్యంగా కర్ణాటక ప్రభుత్వం ఆలమట్టి డ్యామ్ ఎత్తును పెంచేందుకు నిర్ణయం తీసుకున్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం మౌనం వహించడం దారుణమని ఆమె విమర్శించారు. ఆలమట్టి ఎత్తు పెంచితే తెలంగాణకు దాదాపు 100 టీఎంసీల నీటి నష్టం వాటిల్లుతుందని, దీనిని వ్యతిరేకిస్తూ మరియు అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడాన్ని నిరసిస్తూ అసెంబ్లీలో తక్షణమే ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. జూరాల నుంచి శ్రీశైలానికి ఇన్టేక్ పాయింట్లను మార్చడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ఆమె ప్రశ్నించారు.
కీలకమైన నీటి పంపకాలపై చర్చ జరుగుతున్న సమయంలో సభలో ప్రతిపక్షం లేకపోవడం ప్రజాస్వామ్య లోపమని కవిత పేర్కొన్నారు. “అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం హరీష్ రావు వ్యక్తిగతంగా తీసుకున్నారా? లేక బిఆర్ఎస్ హైకమాండ్ ఆదేశమా?” అని ఆమె సూటిగా ప్రశ్నించారు. సభను వదిలి పారిపోవడం వల్ల ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం కోల్పోయారని, తద్వారా ప్రతిపక్ష బాధ్యతను విస్మరించినట్లయిందని ఆమె విశ్లేషించారు.
తాను నైతిక విలువల కోసమే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని, తన పోరాటం ఏ నాయకుడిపైనా వ్యక్తిగత ద్వేషంతో కాదని, కేవలం అవినీతికి వ్యతిరేకమని కవిత స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లాలో విచ్చలవిడిగా సాగుతున్న భూకబ్జాలు, అక్రమ ఇసుక తవ్వకాలు, కృష్ణా నది కాలుష్యం, మౌలిక సదుపాయాల లేమిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తమ ప్రభుత్వం (బిఆర్ఎస్) ఉన్నప్పుడు జరిగిన తప్పులను నాయకులు అంగీకరించి, వాటిని సరిదిద్దుకోవాలని హితవు పలికారు. అధికారంలో ఎవరున్నా సరే.. తెలంగాణ జాగృతి వేదికగా ప్రజా సమస్యలపై, అవినీతిపై తన గళం వినిపిస్తూనే ఉంటానని, జిల్లా పర్యటనలతో ప్రజలకు మరింత చేరువవుతానని కవిత స్పష్టం చేశారు.
Read Also: కేసీఆర్ ఫామ్హౌస్ ముట్టడి.. అసెంబ్లీకి రావాలి లేదా రాజీనామా చేయాలి: కాంగ్రెస్ డిమాండ్