Jr NTR: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ సినిమా డ్రాగన్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా గురించి ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తి ఉంది. ఇటీవల సెట్స్ నుంచి వచ్చిన ఫోటోలలో ఎన్టీఆర్ కొత్త లుక్లో కనిపించారు. ఈ సినిమాలో పాత్ర కోసం ఆయన చేసిన మార్పు అభిమానులను ఈ సినిమా కోసం మరింత ఆత్రుతగా ఎదురుచూసేలా చేస్తున్నాయి. చాలా మంది అభిమానులు ఈ లుక్ సినిమా హైలైట్ అవుతుందని భావిస్తున్నారు.
ఇలాంటి పెద్ద సినిమా షూటింగ్ మధ్యలో కూడా ఎన్టీఆర్ ఇటీవల బెంగళూరులో జరిగిన ఒక ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన రోడ్డు భద్రత గురించి చాలా ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు.
ఆ సందర్భంలో మాట్లాడిన ఎన్టీఆర్, తన కుటుంబానికి ప్రమాదాలు ఎలా ప్రభావం చూపాయో చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో తన తండ్రి.. పెద్దన్నయ్యను కోల్పోయిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ ఘటనలు తన జీవితంలో పెద్ద మార్పు తీసుకువచ్చాయని అన్నారు. అందుకే రోడ్డు భద్రత ఎంత ముఖ్యమో తనకు బాగా తెలుసని చెప్పారు.
అలాగే తాను కూడా ఒకసారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ అనుభవం తర్వాత రోడ్డు మీద జాగ్రత్తగా ఉండటం ఎంత అవసరమో మరింతగా అర్థమైందని తెలిపారు. వాహనం నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎన్టీఆర్ సూచించారు. ట్రాఫిక్ నియమాలు తప్పకుండా పాటించాలని చెప్పారు. ఒక చిన్న ఆలోచన చాలా ప్రాణాలను కాపాడగలదని ఆయన అన్నారు.
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన కుటుంబాన్ని గుర్తు పెట్టుకోవాలని ఎన్టీఆర్ సూచించారు. ఇంట్లో మన కోసం ఎదురు చూస్తున్న వాళ్ల గురించి ఆలోచిస్తే మనం తప్పకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా విజయం గురించి కూడా ఆయన మాట్లాడారు. జీవితంలో విజయాన్ని సాధించాలంటే కష్టపడి పని చేయాల్సిందేనని చెప్పారు. విజయానికి ఎలాంటి షార్ట్కట్ ఉండదని, క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు.
ఎన్టీఆర్ చెప్పిన ఈ మాటలు అక్కడ ఉన్నవారిని ఎంతో ప్రభావితం చేశాయి. సోషల్ మీడియాలో కూడా ఆయన సందేశాన్ని చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉండగా, డ్రాగన్ సినిమా గురించి అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మరో పెద్ద విజయంగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.