Nishant Kumar JDU: బిహార్ రాజకీయాల్లో ఒక శకం ముగిసి మరో కొత్త అధ్యాయం మొదలైంది. రెండు దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన కుమారుడు నిశాంత్ కుమార్ను రాజకీయ వారసుడిగా రంగంలోకి దించారు. 50 ఏళ్ల నిశాంత్ కుమార్ ఆదివారం అధికారికంగా జనతాదళ్ (యునైటెడ్) పార్టీలో చేరారు. విద్యావంతుడైన ఇంజనీర్ అయినప్పటికీ ఇన్నాళ్లూ రాజకీయాలకు దూరంగా ఉన్న నిశాంత్.. తన తండ్రి మార్గదర్శకత్వంలో పార్టీని బలోపేతం చేస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు.
నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో ఖాళీ కాబోయే స్థానాన్ని భర్తీ చేసేందుకే ఈ మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (75) మార్చి 16న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. గతంలో లోక్సభ ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన.. ఇప్పుడు రాజ్యసభకు వెళ్లడం ద్వారా నాలుగు సభల్లోనూ సభ్యుడిగా ఉన్న అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నారు. బిహార్ దిగ్గజ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్.. సుశీల్ మోడీ సరసన నితీశ్ నిలవనున్నారు. ఆయన రాజ్యసభకు వెళ్లిన వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. దీనివల్ల బిహార్లో తొలిసారిగా బీజేపీ నుంచి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది.
నిశాంత్ కుమార్ అరంగేట్రంతో ఆయనకు బిహార్ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పరిణామాలపై ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ తీవ్రంగా మండిపడింది. ఇదొక రాజకీయ కిడ్నాప్ అని.. నితీశ్ ఓటర్లను మోసం చేశారని ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ ఝా విమర్శించారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో తరహాలోనే నితీశ్ కుమార్ను బీజేపీ తన గుప్పిట్లోకి తీసుకుందని ఆయన ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండేను డిమోట్ చేసినట్లే.. బిహార్లో నితీశ్ను కూడా పక్కన పెట్టేందుకు బీజేపీ ఈ వ్యూహం పన్నిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.