Uttam Kumar Reddy: హైదరాబాద్లోని ఎర్రమంజిల్ జలసౌధలో ఆదివారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై కీలక సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఎక్సైజ్ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి సాగునీటి రంగాన్ని బలోపేతం చేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ఖరీఫ్ సీజన్లోనే అత్యధికంగా వరి సాగు జరిగిందని, కృష్ణా జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై గత ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి విమర్శించారు. రూ. 55 వేల కోట్ల ప్రాజెక్టులో కేవలం రూ. 27 వేల కోట్లు ఖర్చు చేసి, 90 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పడం హాస్యాస్పదమని మండిపడ్డారు. ప్రాజెక్టు అంచనాలను రూ. 84 వేల కోట్లకు పెంచినప్పటికీ, ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. జూరాల నుంచి శ్రీశైలానికి ప్రాజెక్టును మార్చడం వల్ల జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల భూసేకరణ కోసం జూన్ 2వ తేదీలోపు రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తామని, నిధులను గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేసి 2028 డిసెంబర్ నాటికి అన్ని పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
వచ్చే మార్చి, ఏప్రిల్ నాటికి ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. గత పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసినందుకే ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. జూరాల బ్రిడ్జి భద్రత దృష్ట్యా దానిపై వాహనాల రాకపోకలను నిలిపివేస్తామని, ప్రజాభిప్రాయం మేరకే ఈ విషయంలో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. పాలమూరు ప్రజలు కన్న సాగునీటి కలలను తమ ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Bhoodan Land Scam: భూదాన్ కమిటీ ముసుగులో.. రూ. 3 కోట్లు వసూళ్ళు చేసిన గ్యాంగ్ అరెస్ట్!