నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తీవ్రవాయుగుండంగా కొనసాగుతున్నది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా తీవ్రవాయుగుండం కదులుతుంది. మధ్యాహ్నంలోపు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని తెలుస్తోంది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో చాలాచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్పింది వాతావరణశాఖ.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పిఠాపురం ఎమ్మెల్యే అయిన ఆయన స్ఫూర్తితో జనసేన వీర మహిళ బుర్ర దివ్యరాజ్ ఆధ్వర్యంలో బృహత్తర వైద్య శిబిరం జరిగింది. దాదాపు రూ.2 కోట్ల వ్యయంతో జిఎస్ఎల్ హాస్పిటల్ సహకారంతో 3 రోజుల పాటు రెడ్డి రాజా కల్యాణ మండపంలో 6,000 మందికి దంత వైద్య పరీక్షలు, చికిత్సలు నిర్వహించారు.
మంత్రి నారా లోకేశ్ ఈరోజు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఆయన రేపు పార్లమెంట్ హౌస్లో పార్టీ ఎంపీలతో కలిసి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. ముఖ్యంగా, మెంథా తుపాను నష్టపరిహారంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను లోకేష్ కలవనున్నారు. ఈ పర్యటనలో హోంమంత్రి అనిత కూడా లోకేష్తో పాటు ఉంటారు.
అమరావతిలో జోగి రమేష్, ఆయన సోదరుడు రాము కస్టడీలో ఉండగా వారి ఫోన్లను అన్లాక్ చేశారు అధికారులు. సాంకేతిక విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపిన ఫోన్లను అన్లాక్ చేయమని అడగగా వారే తెరిచారు. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్ధనరావు వాంగ్మూలం నేపథ్యంలో, రమేష్ ఇంటి సీసీ కెమెరా ఫుటేజీని కూడా ఫోన్లో పరిశీలించగా, జనార్ధనరావు రమేష్ ఇంటి వద్ద తిరిగిన దృశ్యాలు కనిపించినట్లు సమాచారం.
భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కేవలం 15 రోజులే నిర్వహించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ భద్రత, కాలుష్యం, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల వంటి ప్రధాన సమస్యలపై చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంట్ను మమ అనిపించాలని చూస్తోందని ఆరోపించారు.
నరసరావుపేట ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఎక్స్ వేదికగా ఏపీ యువతకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో యువత తమ సమస్యలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తే, వాటిని సహచర టీడీపీ ఎంపీలతో కలిసి పార్లమెంటులో ప్రస్తావిస్తానని తెలిపారు. యువత భాగస్వామ్యంతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
గిరిజనుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని….గిరిజన హక్కులను కాలరాస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. మచిలీపట్నంలో జరిగిన గిరిజనుల ఆత్మీయ ముఖ్య నేతల సమావేశానికి…ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊహించని ఝలక్ తగిలింది. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాడీవేడిగా జరిగింది. ఈ సమావేశంలో వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ తులసి అంబటిపై అవినీతి ఆరోపణలు చేశారు. ఈ పరిణామం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మన్యం జిల్లా సాలూరు లైంగిక వేధింపుల కేసులో మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ మలుపు తిరుగుతోంది. వ్యవహారంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దిగుతున్నాయి. ఈ కేసులో పీఏ సతీష్పై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ సతీష్పై ఇప్పటివరకూ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పలు విమర్శలకు దారితీస్తున్నాయి.
ములుగు జిల్లాలోని మేడారం వనదేవతల వద్ద ముందస్తు భక్తుల రద్దీ పెరిగింది. మహాజాతరకు ముందే భక్తులు భారీగా తరలివచ్చి సమ్మక్క సారలమ్మలకు మొక్కులు సమర్పిస్తున్నారు. మరోవైపు, గ్రానైట్తో జరుగుతున్న గద్దెల పునర్నిర్మాణ పనులపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా వీక్లీ మార్కెట్ రోడ్లోని సర్వేనెంబర్ 6 లో ఉన్న అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. కల్లు దుకాణంతో పాటు, ఇసుక కుప్పల కోసం వేసిన షెడ్లను అధికారులు తొలగించారు.
కూకట్పల్లిలోని నల్ల చెరువును సందర్శించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. చెరువుల సుందరీకరణలో భాగంగా అభివృద్ధి చేస్తున్న సీఎంకు, హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. నల్ల చెరువు బాధిత రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బాధితులకు నష్ట పరిహారం చెల్లించేలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
నల్గొండ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి ఓ షాపులోకి దూసుకెళ్లింది. నార్కట్పల్లిలోని నల్గొండ చౌరస్తా వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా…రోడ్డు సక్రమంగా లేకపోవడంతో అదుపుతప్పి ఎదురుగా ఉన్న షాపులోకి దూసుకెళ్లింది. ఘటనలో నార్కట్పల్లికి చెందిన అభిరామ్ మృతిచెందాడు.
మా ఓటు విలువైనది దానిని అమ్ముకోమని హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామంలోని ఓ యువకుడు వినూత్న రీతిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ తన ఇంటి ఎదుట ప్లెక్సీ ఏర్పాటు చేశాడు. అనిల్ అనే యువకుడు తన ఇంటి ముందు ఓటు ఆవశ్యకతను తెలియజేస్తూ…తనతో పాటు కుటుంబ సభ్యుల ఓటును అమ్ముకోమంటూ ప్లెక్సీని ప్రదర్శిస్తూ ఓటుపై చైతన్యం తీసుకువస్తున్నాడు.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ సమీపంలోని 63వ జాతీయ రహదారిపై పోలీసుల ఆధ్వర్యంలో విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు తనిఖీలు కీలక పాత్ర పోషిస్తాయని పట్టణ సీఐ దేవేందర్ రావు పేర్కొన్నారు.
అవినీతి కేసుల్లో ఐదేళ్లుగా విచారణ ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని దేశాధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్కు అధికారికంగా లేఖ రాశారు. విచారణ వల్ల దేశానికి నాయకత్వం వహించడం కష్టమవుతోందని, ఈ విచారణ దేశాన్ని విభజిస్తోందని నెతన్యాహు పేర్కొన్నారు.
ఛత్తీస్గఢ్ రాజధాని నగరం రాయ్పుర్లో ముగ్గురు మాజీ సైనికులు ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి.. ఆర్మీ, అగ్నివీర్, పోలీసు ఉద్యోగాల అభ్యర్థులకు ఉచిత తర్ఫీదు ఇస్తున్నారు. రాయ్పుర్లోని శాశ్వత్ నగర్లో పేద, మురికివాడల ప్రాంతాలకు చెందిన యువతకు వీరు శిక్షణ అందిస్తున్నారు.
సీనియర్ హీరోగా మారిన తర్వాత రొమాంటిక్ పాత్రలు సరదాగా అనిపించవని మమ్ముట్టి అన్నారు. అనారోగ్యం కారణంగా కొంత విరామం తీసుకున్న తర్వాత ఆయన తిరిగి బిజీ అయ్యారు. ప్రస్తుతం తన అప్కమింగ్ సినిమా ‘కలాంకావల్’ ప్రచారంలో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు.
అగ్ర కథానాయకులు చిరంజీవి, వెంకటేశ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం మన శంకరవరప్రసాద్గారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, చిరు-వెంకీల కాంబోలో ఓ మాస్ డ్యాన్స్ నంబర్ చిత్రీకరణను హైదరాబాద్లో ప్రారంభించారు. సుమారు 500 మంది డ్యాన్సర్లతో తెరకెక్కిస్తున్న ఈ పాటలో ఇద్దరు హీరోల హుషారైన స్టెప్పులు ఆకర్షణగా నిలవనున్నాయి.
పుల్లెల గాయత్రి-ట్రెసా జాలీ జోడీ లక్నోలో జరిగిన సయ్యద్ మోడీ వరల్డ్ టూర్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో తమ టైటిల్ను నిలబెట్టుకుంది. 76 నిమిషాలు జరిగిన ఫైనల్లో ఈ టాప్సీడ్ జోడీ జపాన్కు చెందిన కహో ఒసావా–మాయ్ తనాబె ద్వయంపై గెలుపొందింది. ఐదు నెలల విరామం తర్వాత పునరాగమనం చేసిన గాయత్రి-ట్రెసా జోడీకి రూ.16.94 లక్షల ప్రైజ్ మనీ దక్కింది.