Temples that opens once a year:మధురైకి వెళ్లినవారు అక్కడి మీనాక్షి అమ్మవారిని దర్శించుకునే వారిలో కొంతమంది మాత్రమే అక్కడ దగ్గరలో ఉన్న అళగర్ కోవిల్ ఆలయాన్ని చూడకుండా వెనుతిరగరు. కారణం ఈ ఆలయం రెండువేల సంవత్సరాల చరిత్ర ఉన్న గుడి ఇది.మధురైకి 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన చెట్ల నడుమ, ఓ కొండ పక్కన ఉన్న ఆలయమే అళగర్ కోవిల్. మూలమూర్తి పేరు తిరుమాళ్. ఆయన చాలా అందంగా ఉంటాడు. కాబట్టి అళగర్ అని పిలుస్తారు. తమిళ సాహిత్యంలో ఈ ఆలయం ప్రత్యేకత కనిపిస్తుంది. వైష్ణవ దివ్యదేశాలుగా భావించే 108 పుణ్యక్షేత్రాలలలో ఈ క్షేత్రమూ ఒకటి.
అళగర్ కోవిల్ ను మధురలోని మీనాక్షి అమ్మవారికి ఈ స్వామిని సోదరునిగా భావిస్తారు. మధురలో మీనాక్షి అమ్మవారి కళ్యాణోత్సవం జరిగే సమయంలో, ఇక్కడి నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహం తరలివెళ్తుంది. ఈ అళగర్ స్వామిని దర్శిస్తే మనసులో కోరికలు తప్పక తీరుతాయని భక్తుల నమ్మకం. మహాభారతకాలంలో ధర్మరాజు, అర్జునులు సైతం ఈ ఆలయాన్ని సందర్శించారని అంటారు. కృష్ణదేవరాయలు మొదలుకొని విశ్వనాథ నాయకుని వరకు అందరూ ఈ స్వామిని సేవించినవారే.
అళగర్ కోవిల్ దగ్గరకి చేరుకోగానే మనం వేరే ప్రపంచానికి వచ్చిన అనుభూతి కలుగుతుంది.అళగర్ కోవిల్ ఆలయం వెలుపల ఉండే కరుప్పుస్వామి సన్నిధి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి. అళగర్ కోవిల్లోని ఉత్సవ విగ్రహం స్వచ్ఛమైన బంగారంతో చేయబడింది.
అళగర్ కోవిల్ వెలుపల ఉన్న కరుప్పుస్వామి సన్నిధి చాలా శక్తిమంతమైనదని చెబుతారు. సామాన్య భక్తులు ఈ స్వామి ఉగ్రరూపాన్ని చూసి తట్టుకోలేరని అంటారు. అందుకే ఏడాదిలో ఒక్కసారే ఈ ఆలయం తలుపులు తీస్తారు. విచిత్రంగా అలా తలుపులు తీసే సమయంలో పక్షులు, కీటకాలతో సహా చుట్టూ ఉండే అడవులన్నీ ప్రశాంతంగా మారిపోతాయట. ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిపోతుందని చెబుతారు.