Boneless Fish: ఇప్పటికీ చాలామంది చేపలు తినడానికి భయపడుతుంటారు. ఎందుకంటే.. చేపలోని ముళ్లు గొంతులో ఇరుక్కుపోతుందనే కారణంతోనే మానేస్తుంటారు. అదే ముళ్లులేని చేపలు ఉంటే.. ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంతో తినేస్తారు. ఈ సమస్యకు తాజాగా చెక్ పెట్టేశారు చైనా శాస్త్రవేత్తలు. ఆ విషయం ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అదేనండి.. చైనా శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో ఎముకలు లేని చేపను సృష్టించారు. దీనిలో మాంసం లోపల కనిపించే ప్రమాదకరమైన ముళ్లు లేకుండా చేశారు. అదెలా సాధ్యమైందో ఇప్పుడు తెలుసుకుందాం.
చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్( CAS ) సైంటిస్ట్లు ‘గిబెల్ కార్ప్’ అనే చేపపై ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయోగాలు చేస్తున్నారు. ఎందుకంటే.. ఈ చేపను చైనాలో చాలా ఇష్టంగా తింటారు. అయితే, దీనికి 80 కంటే చాలా సన్నని, Y ఆకారపు ముళ్లు ఉంటాయి. ఇవి గొంతులో ఇరుక్కుంటే ప్రాణాలకే ప్రమాదం. ఈ నేపథ్యంలో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు చైనీస్ సైంటిస్ట్లు.
చేపల మాంసంలో చక్కటి వెన్నుముకలను ఉత్పత్తి చేసే Cgrunx2b అనే జన్యువును తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ తర్వాత వాళ్లు చేపల DNA నుండి ఈ జన్యువును తొలగించడానికి CRISPR సాంకేతికతను/ మాలిక్యులర్ కత్తెరలను ఉపయోగించారు. దీంతో ఎన్నో సంవత్సరాల కృష్టికి ఫలితంగా ఈ చేపలు సాధారణంగా పెరిగాయి. ఇలా పెరిగిన చేపల మాంసంలో ఎలాంటి ఎముకలు అభివృద్ధి చెందలేదు.
గుడ్ న్యూస్ ఏమిటంటే.. ఈ జన్యు మార్పు చేపల రుచిపై లేదా ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదట. ఈ ప్రయోగంలో చేప యొక్క వెన్నెముక చెక్కుచెదరకుండా అలానే ఉంది. ఈ విధానం చేపలు ఈత కొట్టడానికి, స్వేచ్ఛగా పెరగడానికి వీలుగా ఉంటుంది. ఇక ఫిష్ ప్రియకులు ముళ్లు చిక్కుకుంటాయనే భయం లేకుండా రుచిని ఆస్వాదించగలరని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.