సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు పోలీస్ స్టేషన్లో గురువారం అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎస్ఐ రమేష్ ఒక లారీ యజమాని నుంచి రూ. 20,000 లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఈ నగదు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ బృందం ఆయనను అదుపులోకి తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన కేసు వివరాలు ఇలా ఉన్నాయి.
అధికారుల కథనం ప్రకారం.. 2025 అక్టోబర్ 17వ తేదీన కొల్లూరు పోలీసులు అక్రమంగా రేషన్ బియ్యం (PDS Rice) తరలిస్తున్న ఒక లారీని పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, లారీని స్టేషన్లో ఉంచారు. అయితే.. ఈ కేసు నుంచి సదరు లారీని, దాని యజమానిని తప్పించడంతో పాటు లారీని అప్పజెప్పేందుకు ఎస్ఐ రమేష్ లంచం డిమాండ్ చేశారు. ఇందుకు ప్రతిఫలంగా రూ. 20 వేలు చెల్లించాలని ఆయన ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.
ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు..
ఎస్ఐ అడిగిన లంచం ఇవ్వడం ఇష్టం లేని లారీ యజమాని.. వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. గురువారం లారీ యజమాని నుంచి ఎస్ఐ రమేష్ నగదు తీసుకుంటుండగా.. మాటు వేసిన ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలోని బృందం ఆయనను పట్టుకుంది. లంచం డబ్బును స్వాధీనం చేసుకున్న అధికారులు రమేష్ను అరెస్ట్ చేశారు.
అక్రమాస్తులపై విచారణ..
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఎస్ఐ రమేష్ ప్రస్తుతం బదిలీ లిస్ట్లో ఉన్నారు. త్వరలోనే ఆయన మరో ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఆయన లంచం తీసుకుంటూ పట్టుబడటం కలకలం రేపింది. కేవలం ఈ లంచం కేసు మాత్రమే కాకుండా.. రమేష్కు సంబంధించిన ఇతర ఆస్తులపై కూడా ఏసీబీ దృష్టి సారించింది. ఆయన నివాసంతో పాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి.. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
ఈ ఘటనతో కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ALSO READ: Karimnagar district: వాటర్ ఫాల్ను తలపిస్తున్న హెచ్ఎండబ్ల్యూఎస్ పైప్ లైన్.. కరీంనగర్ జిల్లాలో ఘటన
రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కొల్లూరు ఎస్సై
ఓ కేసులో భాగంగా FIR లో నుంచి పేరు తొలగించేందుకు పోలీస్ స్టేషన్ లోనే రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన సంగారెడ్డి జిల్లా కొల్లూరు ఎస్సై రమేష్ pic.twitter.com/T7GyCloqPj
— ChotaNews App (@ChotaNewsApp) January 2, 2026