Skin Care Tips: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ఇల్లు, ఆఫీసు అనే తేడా లేకుండా రోజంతా ఏసీ ఆన్ చేసి ఉంచుతాం. చల్లటి గాలి హాయినిచ్చినప్పటికీ, ఎక్కువ సమయం ఏసీలో గడపడం వల్ల చర్మం తన సహజమైన తేమను కోల్పోతుంది. దీనివల్ల చర్మం పొడిబారడం, దురద వంటి సమస్యలు మొదలవుతాయి. అసలు ఏసీ వల్ల చర్మం ఎందుకు పాడవుతుంది? దాన్ని ఎలా కాపాడుకోవాలో హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ కమలేష్ అందించిన కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఏసీ గదిలోని వేడి గాలిని లాగేసి చల్లదనాన్ని ఇచ్చే క్రమంలో అక్కడ ఉన్న తేమను (హ్యుమిడిటీ) పూర్తిగా తగ్గించేస్తుంది. వాతావరణంలో తేమ తగ్గడం వల్ల మన చర్మంపై ఉండే రక్షణ పొర దెబ్బతింటుంది. కేవలం చర్మం పొడిబారడమే కాకుండా.. పెదవులు పగలడం, కళ్లు మంటలు పుట్టడం, గొంతు, ముక్కు ఎండిపోయినట్లు అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఏసీ వల్ల పోయిన తేమను తిరిగి పొందడానికి ముఖాన్ని మృదువైన క్లెన్సర్తో శుభ్రం చేసుకోవాలి. ఆ వెంటనే మంచి మాయిశ్చరైజర్ను రాయడం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా గ్లిజరిన్, సిరమైడ్స్ లేదా హైలురోనిక్ యాసిడ్ ఉన్న మాయిశ్చరైజర్లు చర్మాన్ని ఎక్కువ సమయం హైడ్రేటెడ్గా ఉంచుతాయి. స్నానం చేసిన వెంటనే లేదా ముఖం కడుక్కున్న వెంటనే మాయిశ్చరైజర్ రాస్తే తేమ చర్మంలోనే లాక్ అవుతుంది.
Also Read: ఏసీలో పడుకుంటే తలనొప్పి వస్తోందా? నిపుణులు చెబుతున్న అసలు కారణాలివే!
ఆఫీసులో లేదా ఇంట్లో ఏసీ వాడేటప్పుడు గదిలోని పొడి వాతావరణాన్ని మార్చడానికి హ్యుమిడిఫైయర్ ఉపయోగించడం చాలా మంచిది. ఇది గదిలో అవసరమైన తేమను స్థిరంగా ఉంచుతుంది. దీనివల్ల ఏసీ ఆన్లో ఉన్నా కూడా చర్మం, కళ్లు త్వరగా పొడిబారవు.
చర్మం పైకి ఆరోగ్యంగా కనిపించాలంటే శరీరానికి లోపలి నుండి కూడా తగినంత నీరు అందాలి. అందుకే ఏసీలో ఉన్నప్పుడు దాహం వేయకపోయినా సరిపడా నీళ్లు తాగుతూ ఉండాలి. నీటితో పాటు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, హెర్బల్ టీ వంటి ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్కు గురికాకుండా ఉంటుంది. చర్మాన్ని కాపాడుకోవడానికి ఈ చిన్న చిట్కాలు తప్పక పాటించాలి.
Also Read: టీనేజర్ల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న ఎనర్జీ డ్రింక్స్.. తస్మాత్ జాగ్రత్త!