మహిళలు ప్రతి నెలా ఎదుర్కొనే సహజ ప్రక్రియ నెలసరి.ఈ సమయంలో శరీరంలో హార్మోన్ల మార్పులు జరుగుతాయి. అందువల్ల చాలామందికి అలసట, బలహీనత, పొట్ట నొప్పి, నడుము నొప్పి, చిరాకు, మూడ్ మార్పులు, కాళ్ల నొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి. పీరియడ్స్లో ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యమైనవి. ఏం తింటే శరీరం తేలికగా ఉంటుంది? ఏవి తగ్గించాలి? అనే విషయాలను తెలుసుకోవాలి.
పీరియడ్స్లో ఐరన్ ఎంత ముఖ్యమో తెలుసా?
నెలసరి సమయంలో రక్తస్రావం వల్ల ఐరన్ స్థాయిలు తగ్గుతాయి. ఐరన్ తగ్గిపోతే తల తిరగడం, అలసట, శరీరం బలహీనంగా ఉండటం వంటి సమస్యలు పెరుగుతాయి. అందుకే ఈ రోజుల్లో ఇనుము అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం చాలా అవసరం. ఐరన్ కోసం పాలకూర, బీట్రూట్, శనగలు, మినుములు, బీన్స్, ఖర్జూరాలు, కిస్మిస్, పనస గింజలు వంటివి అధికంగా తినాలి. నాన్ వెజ్ తినే వారు చికెన్ తినాలి.
నొప్పి తగ్గించే ఆహారాలు
పీరియడ్ పెయిన్ తగ్గించడానికి మగ్నీషియం, కాల్షియం అవసరం. చాలామందికి ఈ రోజుల్లో కాళ్లలో, వెన్నులో, కడుపులో నొప్పి ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని కండరాలు బిగుసుకుపోవడం వల్ల వస్తాయి. ఈ సమయంలో మెగ్నీషియం, కాల్షియం ఉన్న ఆహారాలు కండరాలను రిలాక్స్ చేయడంలో సహాయపడతాయి. పాలు, పెరుగు, నువ్వులు, బాదం, జీడిపప్పులు, అరటి పండు, ఓట్స్, అవకాడో వంటి ఆహారాలు తినాలి. ఇలాంటి ఆహారాలు నొప్పిని తగ్గించడమే కాకుండా శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతాయి.
హార్మోన్ల సమతుల్యం కోసం B6, B12 విటమిన్లు అవసరం పడతాయి. పీరియడ్స్ సమయంలో మూడ్ స్వింగ్స్, చిరాకు, తల దద్దుర్లు వంటి సమస్యలు చాలా మందికి ఎదురవుతాయి. ఇవన్నీ హార్మోన్ల మార్పుల వల్లే. ఈ సమయంలో విటమిన్ B6, B12 ఉన్న ఆహారాలు తీసుకుంటే హార్మోన్లు సమతూకంగా ఉంటాయి. అరటి పండు, గుడ్లు, చేపలు, మొలకలు, బంగాళాదుంప, పాల ఉత్పత్తులు వంటివి మూడ్ను నియంత్రించడంతో పాటు శక్తిని కూడా పెంచుతాయి.
నీరు ఎక్కువగా తాగడం అవసరం
పీరియడ్స్ సమయంలో చాలా మందికి కడుపు ఉబ్బరం, శరీరంలో నీరు నిల్వ ఉండే సమస్యలు వస్తాయి. ఈ సమస్యలను తగ్గించడానికి రోజుకు కనీసం 8–10 గ్లాసుల నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. నీరు శరీరాన్ని హైడ్రేట్గా ఉంచి, టాక్సిన్స్ను బయటకు పంపుతుంది. నీరు తాగడం వల్ల నొప్పులు కూడా కొంతవరకు తగ్గుతాయి.
పీరియడ్స్లో వేడి పానీయాలు తీసుకుంటే కడుపు నొప్పి తగ్గుతుంది. వేడి ద్రవాలు శరీరంలోని రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. అల్లం టీ, దాల్చినచెక్క టీ, పుదీనా టీ, గ్రీన్ టీ, వేడి నీటితో తేనె వంటివి తీసుకుంటే శరీరాన్ని వేడిగా ఉంచి పీరియడ్ క్రాంప్స్ను తగ్గించడంలో సహాయపడతాయి. పీరియడ్స్ రోజుల్లో వేయించిన, మసాలా ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే అజీర్ణం, బ్లాటింగ్ సమస్యలు పెరుగుతాయి. అందుకే తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.
నెలసరి సమయంలో సరైన ఆహారం తీసుకోవడం శరీరానికి ఎంతో హాయిగా ఉంటుంది. ఇనుము, కాల్షియం, మగ్నీషియం, విటమిన్ B6, B12 అధికంగా ఉన్న ఆహారాలు తీసుకుంటే శరీరం బలంగా ఉంటుంది. నీరు ఎక్కువగా తాగడం, వేడి పానీయాలు తీసుకోవడం, జంక్ఫుడ్ను దూరంగా ఉంచడం ద్వారా పీరియడ్స్లో వచ్చే నొప్పులు, అసౌకర్యం తగ్గిపోతాయి.