Dinner at 7 PM daily: సంపూర్ణ ఆరోగ్యం కోసం పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యమని మనందరికీ తెలుసు. కానీ, సరైన సమయంలో ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. చాలామంది ఆరోగ్య నిపుణులు రాత్రి 7 గంటల్లోపు భోజనం చేస్తే.. ఆరోగ్యానికి చాలా మంచిదని సిఫార్సు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి 7 గంటల్లోపు భోజనం చేయడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలేవో ఇప్పుడు తెలుసుకుందాం.
సాయంత్రం 7 గంటల్లోపు భోజనం చేయడం వల్ల ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేసుకోవడానికి తగినంత సమయం ఉంటుంది. అలాగే భోజనానికి, నిద్రపోవడానిక మధ్య ఎక్కువ సమయం ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ ఆహారాన్ని సమర్థవంతంగా జీర్ణం చేసుకోగలదు. దీంతో అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలు దరిచేరవు.
రాత్రి 7 గంటల్లోపు భోజనం ముగించడం వల్ల మన శరీరం కేలరీలను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. ఈ పద్ధతి బరువు పెరగడాన్ని నియంత్రించగలదు. దీంతో అధిక బరువు ముప్పును తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
సాయంత్రం ముందుగా భోజనం చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఓ గంట అటూ ఇటూ అయితే పర్లేదు కానీ..
9 గంటల తర్వాత భోజనం తీసుకుంటే.. స్ట్రోక్, గుండె సమస్యలు వచ్చే అవకాశం నిపుణులు ఉందని చెబుతున్నారు. రాత్రి 7 గంటల్లోపు తింటామో.. అప్పుడు 28 శాతం గుండె సమస్యల నుంచి తప్పించుకున్నవారవుతామని సూచిస్తున్నారు.
రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల కొంతమంది వెంటనే నిద్రకు ఉపక్రమిస్తుంటారు. ఇలా చేయడం వల్ల నిద్రలో యాసిడ్ రిఫ్లక్స్ (గుండెల్లో మంట) సంభవించవచ్చు. కాబట్టి.. రాత్రి 7 గంటల్లోపు భోజనం ముగించేస్తే.. పడుకోవడానికి కనీసం 3 గంటల సమయం దొరుకుతుంది. దీంతో గ్యాస్, అసిడిటీ వంటివి ఉండవు. కడుపు తేలిగ్గా మారి మంచి నిద్ర మీ సొంతమవుతుంది.
సాయంత్రం త్వరగా తినడం వల్ల జీర్ణవ్యవస్థ నిద్రాభంగం కలిగించకుండా.. గాఢమైన నిద్రకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అదే విధంగా.. ఎవరైతే పడుకోవడానికి కనీసం 3 నుంచి 4 గంటల ముందుగా డిన్నర్ని పూర్తిచేస్తారో.. వారికి ప్రశాంతమైన నిద్ర సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
సరైన సమయంలో భోజనం చేయడం వల్ల జీవక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయాం చేయడం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. రాత్రి త్వరగా భోజనం చేయడం వల్ల జీవక్రియ ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు చేకూరుతాయి.
రాత్రి గడిచేకొద్దీ.. మన శరీరంలో ఇన్సులిన్ ప్రభావం తగ్గుతుంది. దీంతో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకే రాత్రి భోజనం త్వరగా తినేస్తే.. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా మంచి అలవాటు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.
పడుకోవడానికి, రాత్రి భోజనానికి మధ్య రెండు గంటల గ్యాప్ కచ్చితంగా ఉండాలి. లేట్ నైట్స్ భోజనం చేసేవారు హైపర్టెన్షన్ తో బాధపడే అవకాశం ఉంది. రాత్రి త్వరగా భోజనం చేయడం వల్ల అధిక రక్తపోటు నియంత్రించవచ్చు. లేదంటే ఒత్తిడి పెరిగి, గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది.