Mouth Cancer Risk: బర్త్డే అంటే సెలబ్రేషన్.. జాబ్ వస్తే సెలబ్రేషన్.. పెళ్లి ఫిక్స్ అయితే సెలబ్రేషన్.. ప్రమోషన్ వచ్చినా పార్టీ, స్నేహితులు కలిసినా పార్టీ.. ఈ మధ్యకాలంలో మద్యం మన జీవితాల్లో ఒక సాధారణ అలవాటులా మారిపోయింది. అయితే, చాలామందిలో ఉన్న ఒక బలమైన అపోహ ఏంటంటే.. ఎప్పుడో ఒకసారి, అదీ మితంగా మద్యం తాగితే ఆరోగ్యానికి పెద్ద ప్రమాదం ఏమీ ఉండదని. కానీ తాజా శాస్త్రీయ పరిశోధనలు ఈ భావన పూర్తిగా తప్పని స్పష్టం చేస్తున్నాయి.
జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం.. రోజుకు కేవలం 9 గ్రాముల ఆల్కహాల్ తీసుకున్నా కూడా నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా నాటుసారా వంటి స్థానిక మద్యం సేవిస్తే ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని BMJ Global Health జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. తక్కువగా తాగుతున్నామనే భ్రమలో ఉన్నవారికీ ఇది గట్టి హెచ్చరికగా మారింది.
2010 – 2021 మధ్య కాలంలో నోటి క్యాన్సర్తో బాధపడుతున్న 1,800 మందికిపైగా, ఆరోగ్యవంతులైన దాదాపు 1,900 మందిపై శాస్త్రవేత్తలు లోతైన అధ్యయనం చేశారు. ఇందులో ముఖ్యంగా 35 – 54 ఏళ్ల మధ్య వయసు గలవారే ఎక్కువగా ఉన్నారు. దీనిలో ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. 25-45 ఏళ్ల వయసు వారిలో కూడా నోటి క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. క్యాన్సర్ బాధితుల్లో ఎక్కువ శాతం మంది మద్యం తాగడంతో పాటు గుట్కా లేదా పొగాకు అలవాట్లు కలిగి ఉండటం గమనార్హం.
మద్యం, పొగాకు వినియోగం తరచూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. పరిశోధకుల మాటల్లో చెప్పాలంటే.. ఆల్కహాల్తో పాటు పొగాకు వాడేవారిలో నోటి క్యాన్సర్ ప్రమాదం నాలుగు రెట్లు పెరుగుతుంది. ఆల్కహాల్ నోటి లోపలి పొరను బలహీనంగా చేస్తుంది. ఆ సమయంలో పొగాకు నమిలితే, అందులోని హానికర రసాయనాలు నేరుగా కణాల్లోకి చేరి క్యాన్సర్ ముప్పును తీవ్రంగా పెంచుతాయి.
చాలామంది క్వాలిటీ లేదా అంతర్జాతీయ బ్రాండ్ మద్యం తీసుకుంటే ప్రమాదం తక్కువ అని భావిస్తుంటారు. కానీ పరిశోధనల ప్రకారం.. మద్యం తాగని వారితో పోలిస్తే మద్యం సేవించే వారిలో నోటి క్యాన్సర్ ప్రమాదం సగటున 68% ఎక్కువగా ఉంది. అంతర్జాతీయ బ్రాండ్ల మద్యం తీసుకున్నా ఈ ముప్పు 70%కి పైగానే ఉంటుందట. ఇక స్థానికంగా తయారయ్యే మద్యాల్లో మెథనాల్, ఎసిటాల్డిహైడ్ వంటి విషపదార్థాలు ఎక్కువగా ఉండటంతో ప్రమాద స్థాయి మరింత అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
భారతదేశంలో నోటి క్యాన్సర్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. క్యాన్సర్ బారినపడిన వారిలో 5 ఏళ్లకు పైగా జీవిస్తున్నవారు 43% మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మేఘాలయ, అస్సాం, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మద్యం కారణంగా నోటి క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనిని ప్రారంభ దశలో గుర్తించకపోతే.. ఈ క్యాన్సర్ దవడ ఎముకలు, మెడ ప్రాంతాలకు వ్యాపించి చికిత్సను మరింత క్లిష్టంగా మార్చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మొత్తంగా చూసుకుంటే.. ఆరోగ్యకరమైన స్థాయిలో మద్యం సేవించడం అన్నది ఒక అపోహ మాత్రమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎంత తక్కువ మోతాదులో తీసుకున్నా, మద్యం క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు ద్వారం తెరిచే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. ఆరోగ్యకరమైన, దీర్ఘాయుష్షు జీవితం కోసం మద్యం, పొగాకు రెండింటికీ దూరంగా ఉండటమే అత్యంత సురక్షితమైన మార్గమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.