విదేశీ పర్యాటకులను సైతం ఆకట్టుకునేలా ములుగు జిల్లాలో టూరిజం అభివృద్ధి చెందుతోంది. భోగత జలపాతాలు, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, వనదేవతలు కొలువైన మేడారం, అందాల లక్నవరం ద్వీపాలు ఇలా చెప్పుకుంటూ పోతే ములుగు జిల్లా ప్రకృతి అందాలు కలగలిసిన భూతల స్వర్గం. ప్రకృతి అందాలకు తోడుగా అమేజాన్ అడవులను మరిపించేలా బ్లాక్ బెర్రీ ఐలాండ్ ను అభివృద్ధి చేసింది ప్రభుత్వం. ప్రపంచానికి దూరంగా ఓ వింత అనుభూతిని కల్పించే బ్లాక్ బెర్రీ ఐలాండ్ కు టూరిస్టుల నుండి గతేడాది అనూహ్య స్పందన రావడంతో ఈ సారి మరిన్ని ప్రత్యేకతలతో ఐలాండ్ ను పునఃప్రారంభించారు.
ములుగు జిల్లాలోని పస్రా-తాడ్వాయి శివారు అటవీ ప్రాంతంలో బ్లాక్ బెర్రీ ఐలాండ్ ను అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆఫ్రికా, అమెరికా అడవుల్లో ఉండే ఐలాండ్ లను ఈ బ్లాక్ బెర్రీ ఐలాండ్ తలపిస్తోంది. వరంగల్ నుండి భూపాలపట్నం వెళ్ళే జాతీయ రహదారి163 కి పక్కనే ఈ ఐలాండ్ ఉంది. పస్రా నుండి 7 కిలోమీటర్ల తర్వాత అడవిలోపలికి 1 కిలోమీటర్ దూరంలో జలగలంచవాగులో ఐలాండ్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతమంతా ఇండియన్ బ్లాక్ బెర్రీ చెట్లు ఉండడంతో బ్లాక్ బెర్రీ ఐలాండ్ పేరును పెట్టారు.
చుట్టూ కొండలు దట్టమైన అడవి మధ్యలో ఉన్న ఇసుక మేటలు ఎడారిని తలపిస్తుంది. పక్కనే పారుతున్న జలగలంచ వాగు, చుట్టూ బ్లాక్ బెర్రీ చెట్లు…. ఈ ప్రదేశాన్ని చూస్తే, కొత్త అనుభూతి కలుగుతుంది. ఐలాండ్ లో పర్యాటకుల కోసం 58 హట్స్ ఏర్పాటు చేశారు. అందులో నలుగురు, ముగ్గురు, ఇద్దరు ఉండేలా మూడు రకాల హాట్స్ ఏర్పాటు చేశారు. పక్కనే పారుతున్న వాగును స్విమ్మింగ్ పూల్ గా మార్చారు.
బీచ్ వాలీబాల్, ఆర్చరీ, షటిల్ ఆటలకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాత్రివేళ అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకునేలా మంచెలను సైతం ఏర్పాటు చేశారు. ఐలాండ్ మొత్తం సోలార్ లైట్లు, రంగురంగుల లైట్ల వెలుతురులో కనువిందు చేసే రెస్టారెంట్, క్యాంప్ ఫైర్ వసతులు కల్పించారు. మొత్తంగా బ్లాక్ బెర్రీ ఐలాండ్ కి వెళ్తే ఒక కొత్త ప్రపంచంలో అడుగుపెట్టినట్లుగా అనిపిస్తుంది. గత సంవత్సరం కంటే ఈసారి డిజైన్స్ తో కూడిన తోరణాలు, ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేశారు.