Shivratri Fasting: సాధారణంగా ఉపవాసం అంటే.. ఏం తినకుండా ఉండటం అని భావిస్తాం. కానీ రోజంతా నీరసం రాకుండా, ఆధ్యాత్మిక చింతనలో గడపాలంటే శరీరానికి తగినంత శక్తి అవసరం. ముఖ్యంగా మహాశివరాత్రి వంటి పండగలలో రోజంతా ఉపవాసం.. ఉండి, రాత్రి జాగరణ చేయాల్సి ఉంటుంది. అలాంటి మనం తీసుకునే ‘ఫలాహారం’ మనల్ని అలసిపోకుండా ఉంచడంలో.. కీలక పాత్ర పోషిస్తుంది. ఉపవాసం రోజున ఎనర్జీని ఇచ్చే పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉపవాసం అనేది కేవలం భక్తికి సంబంధించింది మాత్రమే కాదు. అది శరీరాన్ని శుద్ధి చేసే ఒక ప్రక్రియ. అయితే.. సరైన ఆహార నియమాలు పాటించకపోతే.. తలనొప్పి, కళ్లు తిరగడం లేదా విపరీతమైన నీరసం వచ్చే అవకాశం ఉంది. ఉపవాసం రోజున మన రక్తంలోని చక్కెర స్థాయిలు పడిపోకుండా.. మెదడు చురుగ్గా పనిచేసేలా చేసే కొన్ని ప్రత్యేక పదార్థాలు ఉన్నాయి. ఇవి మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతూ.. దైవ ప్రార్థనలో ఏకాగ్రత దెబ్బతినకుండా తోడ్పడతాయి.
ఉపవాసం రోజున శక్తినిచ్చే ఉత్తమ పదార్థాలు:
1. నీరు, ద్రవాహారం:
ఉపవాసంలో అలసటకు ప్రధాన కారణం డీహైడ్రేషన్. నీరు తక్కువైతే శరీరం త్వరగా నీరసిస్తుంది.
కొబ్బరి నీళ్లు: ఇందులో ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది తక్షణ శక్తిని ఇస్తుంది.
మజ్జిగ: కడుపులో మంటను తగ్గించి.. శరీరాన్ని చల్లబరుస్తుంది.
నిమ్మరసం: గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది.
2. తాజా పండ్లు:
పండ్లు ప్రకృతి సిద్ధమైన చక్కెరలను కలిగి ఉంటాయి, ఇవి తక్షణమే రక్తంలో కలిసి శక్తినిస్తాయి.
అరటిపండు: ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాల నొప్పులు రాకుండా చూస్తుంది. కడుపు నిండుగా ఉంచుతుంది.
ఆపిల్ , దానిమ్మ: వీటిలోని ఫైబర్ నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తుంది. దీని వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు.
3. డ్రై ఫ్రూట్స్ , నట్స్:
గుప్పెడు జీడిపప్పు, బాదం లేదా వాల్నట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్ , ఆరోగ్య కరమైన కొవ్వులు అందుతాయి.
ఖర్జూరం: ఉపవాస సమయంలో ఖర్జూరం తింటే ఆ రోజంతా కావలసిన గ్లూకోజ్ అందుతుంది. ఇది అలసటను తరిమి కొట్టడంలో నంబర్ వన్.
4. సగ్గుబియ్యం:
ఉపవాసం రోజున సగ్గు బియ్యం కిచిడీ లేదా పాయసం తీసుకోవడం ఇండియన్స్కి అలవాటు. ఇందులో కార్బో హైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది జీర్ణం కావడానికి సులభంగా ఉండటమే కాకుండా.. శరీరానికి మంచి శక్తిని ఇస్తుంది.
5. ఉడికించిన దుంపలు:
చిలగడదుంప లేదా కంద గడ్డ వంటివి ఉపవాసంలో ఉత్తమ ఆహారం. వీటిలో ఉండే కాంప్లెక్స్ కార్బో హైడ్రేట్లు శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని నిలకడగా అందిస్తాయి. ఇవి తిన్న తర్వాత చాలా.. సేపటి వరకు ఆకలి వేయదు.
6. పాలు, పెరుగు:
పాలలోని ప్రోటీన్ శరీరానికి బలాన్నిస్తుంది. పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. ఉపవాసం వల్ల వచ్చే ఎసిడిటీ సమస్య తగ్గుతుంది.
నివారించాల్సినవి:
కాఫీ, టీ: వీటిని అతిగా తాగడం వల్ల శరీరంలోని నీరు త్వరగా ఖర్చైపోయి, మరింత దాహం, నీరసం వేస్తుంది.
నూనెలో వేయించిన పదార్థాలు: వడలు, చిప్స్ వంటివి తింటే జీర్ణం కావడానికి ఎక్కువ శక్తి ఖర్చవుతుంది. దీని వల్ల నిద్రమత్తు, అలసట వస్తాయి.