Dark Tourism: కాలంతో పాటు మారుతున్న యువత అభిరుచులకు అనుగుణంగా ప్రపంచ పర్యాటక రంగం కూడా అంతే వేగంగా మారుతోంది. పచ్చని కొండ ప్రాంతాలు, మంచు పర్వతాలు, ప్రకృతి రమణీయత ప్రదేశాలు, సంస్కృతుల సందడుల నుంచి మారణహోమ క్షేత్రాల సందర్శన దిశగా నేటి యువత అడుగులు వేస్తోంది. విహారయాత్ర అంటే.. గతంలో బీచ్లు, సముద్ర తీరాలు, ప్యాలెస్లు, ప్రసిద్ధ జూ పార్కులు, దేవాలయాలు, వివిధ మతాల ప్రార్థనా మందిరాలు వంటి వాటిని చూడటానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే, ఇప్పుడు పర్యాటకులు తమ ప్రాధాన్యతలను మార్చుకున్నారు. నాణేనికి మరోవైపు ఉన్న చారిత్రక కట్టడాలు, ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు, యుద్ధ క్షేత్రాలు, కల్లోల, సంక్షోభ పరిస్థితులకు అడ్డాలుగా నిలిచిన ప్రాంతాలను చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
డార్క్ టూరిజం అంటే.. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న విపత్తులు, విషాదాలు, మరణాలు, హింస వంటి సంఘటనలు ఎక్కడైతే జరిగాయో.. అలాంటి ప్రదేశాలను సందర్శించడం. దీనినే ‘బ్లాక్ టూరిజం’ లేదా ‘తానే టూరిజం’ అని కూడా పిలుస్తుంటారు. ఈ యాత్ర కేవలం చీకటి ప్రదేశాల సందర్శన మాత్రమే కాదు.. మన చరిత్ర పట్ల విజ్ఞానం కోసం చేసే ప్రయాణం. ఇది మనకు మానవ జీవిత విలువలు, శాంతి, ఓర్పుపై అవగాహన కలిగిస్తుంది. ఈ తరహా ప్రయాణాలు కొన్నిచోట్ల సాహసోపేతంగానూ ఉంటాయి. అందుకే.. ఆసక్తి ఉన్న వాళ్లు కలిసి ఒక బృందంగా ఏర్పడి.. ఇలాంటి ప్రదేశాలకు వెళ్లివస్తుంటారు. డార్క్ టూరిజం చేయాలనుకుంటే.. మన దేశంలో ఈ ప్రదేశాలను సందర్శించవచ్చు. అవేంటంటే..
భారతీయుల్లో జాతీయ భావాన్నీ రగిల్చిన ఉదంతం ఈ అమృత్సర్-జలియన్వాలాబాగ్ ప్రదేశం. బ్రిటిష్ పాలకుల క్రూరత్వానికి నిలువెత్తు నిదర్శనం ఈ సంఘటన. ఇటుక గోడల్లో దిగిన తూటాల గుర్తులు, వందల మందిని బలి తీసుకున్న బావి ఇక్కడికి వెళ్లే సందర్శకుల హృదయాలను బరువెక్కిస్తాయి.
మనదేశ స్వాతంత్య్ర సమరయోధులపై బ్రిటీష్ పాలకులు చూపిన క్రూరత్వానికి చిహ్నం ఈ పోర్ట్బ్లెయిర్-సెల్యులార్ జైలు. చిన్నచిన్న గదులు, కఠిన శిక్షలు, ప్రతి గోడపైనా నిక్షిప్తమైన మానవ సహనానికి పరీక్ష పెట్టిన గాథలు ఎన్నో తెలుసుకోవచ్చు.
కార్గిల్ యుద్ధంలో వీర మరణం పొందిన మన సైనికుల ఫొటోలు, యుద్ధంలో వారు పోరాడినటువంటి వీరోచిత కథలు, ఆయుధాలు, సైనిక దుస్తులు, యుద్ధ మ్యాప్లు, ఆయుధాలను లద్దాఖ్- హాల్ ఆఫ్ ఫేంకి వెళ్లినప్పుడు చూడవచ్చు.
ఇది 1999లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధానికి జ్ఞాపకార్థం. మన సైన్యం నిర్మించిన ఈ కట్టడం ప్రతి ఒక్కరిలో దేశభక్తిని నింపుతుంది. మన దేశంలోని చాలామంది యువత ఈ ప్రదేశానికి వెళ్లడానికే ఆసక్తి చూపిస్తుంటారు.
ఇది ట్రైబల్ మ్యూజియం. ఆదివాసీల జీవనశైలితో పాటు, కుమురంభీం జీవితాశయ సాధనను, పోరాటస్ఫూర్తిని ఈ మ్యూజియం ప్రతిబింబిస్తుంది. ఈ ప్రదేశానికి వెళ్లిన ప్రతి భారతీయుడిలోనూ దేశభక్తి వెల్లివిరుస్తుంది.
హైదరాబాద్లోని గోల్కొండ కోట, గుజరాత్లో సబర్మతి జైలు, ఉత్తర ప్రదేశ్లోని చౌరీచౌరా స్మారకం, భోపాల్లో గ్యాస్ ట్రాజెడీ చుట్టుపక్కల ప్రదేశాలకూ డార్క్ టూరిజం పర్యాటకులు ఎక్కువగా వెళుతుంటారు. మరికొన్ని చోట్ల డార్క్ టూరిజంతో పాటు.. ప్రకృతి సంస్కృతి కలిసి పర్యాటకుల్ని మరింతగా ఆకర్షిస్తున్నాయి. భయంకరమైన అడవులు, జాలువారే జలపాతాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.