Pawan Kalyan: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల పరిస్థితిని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సాస్కి’ (Special Assistance to States for Capital Investment) పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్కు రూ. 2 వేల కోట్లు కేటాయించిందని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ నిధులను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుని, ప్రజలకు పటిష్టమైన రహదారులు అందించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ నిధుల వినియోగంలో నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని పవన్ కల్యాణ్ అధికారులను గట్టిగా హెచ్చరించారు. రహదారుల నిర్మాణంలో నాణ్యతతో పని చేయాల్సిన పూర్తి బాధ్యత అధికార యంత్రాంగానిదేనని స్పష్టం చేశారు. నిర్మాణ దశ నుంచి పూర్తయ్యే వరకు పలు దశల్లో క్వాలిటీ చెక్ జరగాలన్నారు. నిబంధనల ప్రకారం పనులు జరగకపోతే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఏమాత్రం అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. తాను, నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి నాణ్యతా ప్రమాణాలను స్వయంగా తనిఖీ చేస్తామని ఆయన వెల్లడించారు.
YS Jaganmohan Reddy: ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు కన్నీరు.. ప్రభుత్వంపై జగన్ విమర్శలు
మౌలిక వసతులలో రోడ్లు కీలకమైనవని, ప్రతి గ్రామానికి మంచి రహదారులు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నిధులను ప్రత్యేక సందర్భాల్లో అభివృద్ధి పనులకు కూడా కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఉదాహరణకు, పుట్టపర్తిలో శ్రీ సత్య సాయిబాబా గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా, అక్కడ మౌలిక వసతుల కల్పన కోసం ఈ నిధుల నుంచి రూ. 35 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణంపై పూర్తి అలక్ష్యం చూపిందని, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించాలని కృతనిశ్చయంతో ఉందని, అధికారులు ఇందులో కీలకపాత్ర పోషించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.