Health Checkup After 30: ముప్పై ఏళ్లు దాటాయంటే చాలు.. జీవితంలో బాధ్యతలతో పాటు పని ఒత్తిడి కూడా ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఈ బిజీ లైఫ్లో చాలామంది తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, వైద్యులు ఏం చెబుతున్నారంటే.. 30 ఏళ్ల వయసు నుంచే శరీరంలో అంతర్గతంగా మార్పులు మొదలవుతాయి. డయాబెటిస్, బీపీ, థైరాయిడ్, గుండె జబ్బులు వంటివి ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండా సైలెంట్గా శరీరంలో చేరే ప్రమాదం ఉంది. అందుకే ఈ వయసులో రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చాలా ముఖ్యం అంటున్నారు.
నేటి యుగంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, గంటల తరబడి కూర్చుని పనిచేయడం, అర్ధరాత్రి నిద్రపోవడం, జంక్ ఫుడ్ తినడం చాలామందికి అలవాటుగా మారింది. దీనికి తోడు మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరం లోపల అవయవాల పనితీరు మందగిస్తుంది. పైకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా, లోపల అనారోగ్యం పెరుగుతుండవచ్చు. ఈ దాగి ఉన్న ముప్పును తెలుసుకోవడానికి ముందస్తు పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి.
Also Read: ఎండ తీవ్రతకు ఐస్ క్రీమ్ తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్త!
కుటుంబంలో ఎవరికైనా షుగర్, బీపీ లేదా గుండె జబ్బులు ఉన్నట్లయితే.. వారికి ఈ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నవారు, నిరంతరం ఒత్తిడితో గడిపేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అధిక బరువు, పోషకాహార లోపం ఉన్నవారు కూడా ముప్పై ఏళ్లు దాటిన తర్వాత కనీసం ఏడాదికి ఒక్కసారైనా ఫుల్ బాడీ చెకప్ చేయించుకోవడం మంచిది. నలభై ఏళ్లు దాటాక ఈ జాగ్రత్తలు మరింత పెరగాలి.
పని చేయకపోయినా విపరీతమైన అలసటగా అనిపించడం.. హఠాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం, తరచూ వచ్చే తలనొప్పి, సరిగ్గా నిద్రపట్టకపోవడం వంటి వాటిని చిన్న సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు. కొద్దిగా నడవగానే రొప్పు రావడం, ఆకలి తగ్గడం కూడా లోపల ఏదో సమస్య ఉందనడానికి సంకేతాలు కావచ్చు. ప్రారంభంలోనే డాక్టర్ను సంప్రదిస్తే భవిష్యత్తులో వచ్చే పెద్ద పెద్ద అనారోగ్యాలను, వైద్య ఖర్చులను అరికట్టవచ్చు. చికిత్స కంటే ముందస్తు జాగ్రత్తే ఎప్పుడూ బెటర్.
Also Read: 60 రోజుల పాటు చక్కెర మానేస్తే.. మన శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!