Working out in heat risks| వ్యాయామం ఆరోగ్యానికి మంచిది, కానీ అధిక వేడిలో అంటే ఎండగా ఉండే సమయంలో చేయడం ప్రమాదకరం. చాలామంది వేడి వాతావరణంలో కూడా ప్రమాదాలను అర్థం చేసుకోకుండా వ్యాయామాలు కొనసాగిస్తారు. సిఎంఐ హాస్పిటల్లో ఇంటర్నల్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ పూజా పిల్లై తెలిపిన వివరాల ప్రకారం.. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే శరీరంపై అదనపు ఒత్తిడిని కలుగుతుంది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ఈ ప్రమాదాలు, భద్రతా చిట్కాలు తెలుసుకుంటే మీరు ఏ నష్టం లేకుండా శరీరాన్ని దృఢంగా ఉంచుకోవచ్చు.
వ్యాయామం చేస్తే శరీరం సహజంగానే వేడెక్కుతుంది. ఆ తరువాత శరీరం చల్లబడడం కూడా అవసరం. వేడి వాతావరణంలో శరీరం చల్లబడటం చాలా కష్టమవుతుంది. చెమట పట్టినా సరిపోకపోవచ్చు. దీనివల్ల శరీరం త్వరగా వేడెక్కి.. వడదెబ్బ ప్రమాదం ఉంటుంది.
ఎండగా ఉన్నప్పుడు వ్యాయామం చేస్తే రక్తాన్ని శరీరమంతా ఎక్కువగా సరఫరా చేయడానికి గుండెపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. చెమట ద్వారా శరీరంలోని నీరు, ఉప్పు ఎక్కువగా తగ్గిపోతాయి. దీనివల్ల డిహైడ్రేషన్, బలహీనత వస్తాయి. కిడ్నీలు, గుండె వంటి అవయవాలపై ఒత్తిడి పడుతుంది.
అతిగా చెమట పట్టడం, త్వరగా అలసిపోవడం, తలతిరగడం, తలనొప్పి, కండరాల నొప్పులు, వికారం, ఇవన్నీ వేడి వల్ల ఆరోగ్యానికి జరిగే నష్టాలకు సంకేతాలు. వీటిని ఎప్పటికప్పుడు గుర్తించాలి.
వృద్ధులు, పిల్లలు, గుండె సమస్యలు లేదా ఇతర అనారోగ్యాలు ఉన్నవారు. బయట ఎండలో పనిచేసే కార్మికులు, క్రీడాకారులు, వీధి వ్యాపారులు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. ఫిట్నెస్ ఉన్న వ్యక్తులు కూడా ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం.
ముందస్తు సంకేతాలను విస్మరిస్తే, శరీరం ఉష్ణోగ్రత తీవ్రంగా పెరిగి వడదెబ్బగా మారుతుంది. ఇది ప్రాణాపాయ స్థితి. శరీర ఉష్ణోగ్రత ప్రమాదకరంగా పెరిగి, మతిమరుపు, అవయవాలు పనిచేయకపోవడం, మరణం కూడా సంభవించవచ్చు.
Also Read: మీ కలలో ఎవరో మిమ్మల్ని వెంటాడుతున్నట్లు లేదా భూతాలు కనిపిస్తున్నాయా? దానికి అర్థం ఇదే
వేడి ఎక్కువగా ఉండే మధ్యాహ్నం వ్యాయామం చేయకూడదు. ఉదయం లేదా సాయంత్రం వ్యాయామం చేయండి. పుష్కలంగా నీరు త్రాగండి. వదులుగా, తెల్లని బట్టలు వేసుకోండి. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోండి. తలతిరగడం లేదా వికారం వస్తే వెంటనే ఆపేయండి.
ప్రత్యేకించి భారతదేశంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటుతోంది. అటువంటి స్థితిలో వ్యాయామం చేస్తే ప్రాణాలకు చాలా ప్రమాదం. చిన్న చిన్న జాగ్రత్తలతో సురక్షితంగా వ్యాయామం చేయండి.