CV Anand Press Meet: ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను.. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కనిపెట్టారు. ఈ మేరకు ఆ ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేశారు . తెలుగు సహా పలు భాషల్లో సినిమా పైరసీ చేసినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. అయితే నిందితుల అరెస్ట్పై హైదరబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించి.. సంచలన విషయాలు బయటపెట్టారు.
పైరసీ వల్ల భారీ నష్టం
సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. పైరసీ కారణంగా సినిమా నిర్మాతలు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు. 2023లో దేశవ్యాప్తంగా మూవీ ఇండస్ట్రీ 22,400 కోట్లు నష్టపోగా, 2024లో తెలుగు సినిమా రంగం మాత్రమే 3,700 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఇది కేవలం నిర్మాతలకే కాకుండా మొత్తం సినీ పరిశ్రమకు దెబ్బతీస్తోందని ఆయన అన్నారు.
పైరసీ–బెట్టింగ్ మాఫియా కుదిపేస్తున్న అనుబంధం
సినిమా పైరసీతో పాటు ఆన్లైన్ బెట్టింగ్ కూడా.. బలంగా పెరుగుతోందని సీపీ తెలిపారు. టారెంట్ వెబ్సైట్లు, టెలిగ్రామ్ ఛానెల్స్ ద్వారా పైరసీ సినిమాలను విడుదల చేస్తూ, వాటి ద్వారా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. 1xbet, Rajbet, Parimatch వంటి యాప్ నిర్వాహకులు నెలకు లక్షల రూపాయలు.. ఈ పైరసీ మాఫియాకు ఇస్తూ ప్రోత్సహిస్తున్నట్లు బయటపెట్టారు.
థియేటర్లలోనుంచి లీకులు
హైదరాబాద్ అత్తాపూర్లోని మంత్ర థియేటర్లో.. జానా కిరణ్ కుమార్ అనే వ్యక్తి మొబైల్ కెమెరా ద్వారా సినిమాలను రికార్డ్ చేసి, ప్రధాన నిందితుడు సిరిల్కు పంపినట్టు విచారణలో తేలింది. ఒక్క సినిమాకు 150–500 డాలర్ల వరకు పారితోషకం అందుతున్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు అతను 40 సినిమాలను థియేటర్లో రికార్డ్ చేశాడు.
ప్రధాన నిందితుడు సిరిల్
ఈ కేసులో కీలక వ్యక్తి కరూర్కు చెందిన సిరిల్. కంప్యూటర్ సైన్స్ చదివిన తర్వాత ఈజీ మనీ కోసం పైరసీ మార్గాన్ని ఎంచుకున్నాడు. 2020 నుంచి తమిళ్ బ్లాస్టర్స్, ఫైవ్ మూవీ రూల్స్ వంటి నాలుగు వెబ్సైట్లను నడుపుతూ.. ఇప్పటివరకు వందల సినిమాలను అప్లోడ్ చేశాడు. ఒకే వెబ్సైట్లోనే 500కు పైగా మూవీలను ఉంచినట్లు పోలీసులు తెలిపారు. నెలకు కనీసం 15 సినిమాలను అప్లోడ్ చేస్తూ, బెట్టింగ్ యాప్ల ద్వారా సుమారు 9 లక్షల వరకు సంపాదిస్తున్నాడు.
హ్యాకర్ అశ్విన్ కుమార్
22 ఏళ్ల అశ్విన్ కుమార్ అనే హ్యాకర్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను డిజిటల్ మీడియా సర్వర్లను హ్యాక్ చేసి సినిమాలను అప్లోడ్ చేస్తున్నాడు. ఇంటి చుట్టూ 22 సీసీ కెమెరాలు పెట్టి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చివరకు పోలీసులు పట్టుకున్నారు. 1020 సినిమాలను సర్వర్లను నేరుగా హ్యాక్ చేసి అప్లోడ్ చేశాడని సీపీ వెల్లడించారు. అంతేకాదు, ఎన్నికల కమిషన్ వంటి ప్రభుత్వ వెబ్సైట్లను కూడా హ్యాక్ చేసిన రికార్డులు లభించాయి.
ఆధునిక టెక్నాలజీ వినియోగం
ఈ గ్యాంగ్ క్రిప్టో కరెన్సీ వాలెట్లు, నెదర్లాండ్–ప్యారిస్ ఐపీ అడ్రస్లను వాడుతూ.. తమ జాడ దాచుకునే ప్రయత్నం చేసింది. అయితే పోలీసులు హార్డ్ డిస్క్లలోని డేటాను స్వాధీనం చేసుకుని మొత్తం నెట్వర్క్ను బహిర్గతం చేశారు.
Also Read: కరూర్ తొక్కిసలాట ఘటనలో కయాదు ఫ్రెండ్ మృతి.. ఒక పోస్టుతో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
పైరసీ కేవలం సినీ పరిశ్రమకే కాకుండా.. సమాజానికి కూడా ప్రమాదకరమని, పైరసీ సినిమాలు చూసే అలవాటుతో యువత ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ వంటి వ్యసనాలకు బానిసవుతున్నారని సీవీ ఆనంద్ హెచ్చరించారు. నిర్మాతల శ్రమ వృథా కాకుండా ఉండాలంటే ప్రజలందరూ పైరసీకి దూరంగా ఉండాలని, ఇలాంటి మాఫియాపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.