Mani ratnam Praises SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి మూవీ ఇండియన్ బాక్సాఫీసు వద్ద ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. పదేళ్ల క్రితం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా దక్షిణాది చలనచిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీసు వద్ద రూ. 2500 పైగా కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. పదేళ్ల తర్వాత ఇప్పుడీ ఈ సినిమా మళ్లీ థియేటర్లలోకి వచ్చింది. రెండు భాగాలను కలిపి ఒక సినిమాగా మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
రీ రిలీజ్లోనూ బాహుబలి సత్తా చాటుతోంది. అక్టోబర్ 31న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా తొలి రోజు రూ. 18 కోట్లు వసూళ్లు చేసింది. ఇక వీకెండ్ వరకు రూ. 25 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్టు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఇది మరో రికార్డు అని చెప్పాలి. రీ రిలీజ్ ఈ స్థాయిలో వసూళ్లు చేసిన చిత్రం ఇప్పటి వరకు లేదు. అది కేవలం బాహుబలి రికార్డు మాత్రమే అవుతుంది. ప్రస్తుతం బాహుబలి రీ రిలీజ్ అయ్యి థియేటర్లలో ఆడుతుండగా.. దర్శకుడు రాజమౌళిపై లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రాజమౌళి లేకపోతే పొన్నియిన్ సెల్వన్ లేదంటూ జక్కన్నను కొనియాడారు. 2022లో ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ పేరుతో ఓ సదస్సు జరిగింది. మణిరత్నం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నియిన్ సెల్వన్ క్రియేటివిటీకి స్ఫూర్తి ఇచ్చిన సంఘటన ఏంటని మణిరత్నంను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. రాజమౌళి స్ఫూర్తి. ఎందుకంటే పొన్నియిన్ సెల్వన్ చేయాలని ఎంతోకాలంగా అనుకుంటున్నారు. అది నా డ్రీం ప్రాజెక్ట్. కానీ, దాన్ని ప్రేక్షకుల ముందుకు ఎలా తీసుకురావాలనేది నాకు అర్థం కాలేదు. అప్పుడే బాహుబలి వచ్చింది. ఆ చిత్రం రెండు భాగాలుగా విడుదలైంది. ఒక కథను రెండు భాగాలుగా చెప్పోచ్చని రాజమౌళి బాహుబలితో చేసి చూపించారు.
అప్పుడే నాకు కూడా పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలుగా చేయాలనే ఆలోచన వచ్చింది. ఒకవేళ బాహుబలి లేకపోతే పొన్నియిన్ సెల్వన్ లేదు. ఈ క్రియేటివిటీకి పూర్తి క్రిడిట్ రాజమౌళికే వెళుతుంది” అంటూ ఆయన చెప్పుకొచ్చారు. గతంలో చేసిన ఈ కామెంట్స్ అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పుడు బాహుబలి రీ రిలీజ్ సందర్భంగా మరోసారి రాజమౌళిని మణిరత్నం కొనియాడిన ఈ వీడియో మరోసారి వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా బాహుబలి చిత్రంతోనే జక్కన్న పాన్ ఇండియా ట్రెండ్ని టాలీవుడ్కి పరిచయం చేశారు. అప్పటి నుంచి మిగత దర్శకులు, హీరోలు కూడా పాన్ ఇండియాని ఫాలో అవుతున్నారు. సినిమాను రెండు భాగాలుగా చూపించొచ్చనేదికి కూడా రాజమౌళినే నాంది వేశారు. ఆయన వేసిన బాటలోనే ఇప్పుడు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమ నడుస్తోంది. ఈ చిత్రాన్ని టూ పార్ట్స్గా తీసి హిట్ కొట్టిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.