Nikhil Siddhartha: హీరో నిఖిల్ సిద్ధార్థ తాజాగా ‘ఎక్స్’ (ట్విట్టర్)లో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఆయన వ్యాఖ్యలు ఏ సినిమా గురించి? ఎవరిని ఉద్దేశించి అన్నారోనని నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
విషయం ఏంటంటే.. నిఖిల్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం స్వయంభు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవల యూట్యూబ్లో విడుదలైంది. టీజర్పై మంచి స్పందన వచ్చినప్పటికీ, కొంతమంది వీడియో క్వాలిటీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డిజిటల్ రిలీజ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో టీజర్ పూర్తిస్థాయిలో కనిపించలేదని మూవీ టీమ్ తెలిపింది.
దీంతో తాజాగా HDR క్వాలిటీతో టీజర్ను మళ్లీ రీ-అప్లోడ్ చేశారు. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “యూట్యూబ్ ఎందుకు ఇలా గ్లిచ్ చేస్తుంది భయ్యా” అంటూ సరదాగా కామెంట్ చేశారు. అయితే అదే ట్వీట్లో ఆయన మరో లైన్ జోడించడంతో వివాదం మొదలైంది.
“ఇటీవల విడుదలైన కొన్ని సినిమాల్లా మా ‘స్వయంభు’ సినిమాలో ఎలాంటి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వాడలేదు” అని నిఖిల్ పేర్కొన్నారు. ఈ ఒక్క వాక్యంతో నెట్టింట చర్చ ముదిరింది. నిఖిల్ ఏ సినిమాను టార్గెట్ చేసి ఇలా అన్నారనే ప్రశ్నలు మొదలయ్యాయి.
కొంతమంది నెటిజన్లు ఈ కామెంట్ నాగబంధం సినిమాపై అని అంటున్నారు. మరికొందరు ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ గురించే కావచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు అయితే ఇది సాధారణ క్లారిఫికేషన్ మాత్రమే అని అంటున్నారు.
ఇదే అంశంపై టీజర్ లాంచ్ ఈవెంట్లో కూడా నిఖిల్ మాట్లాడారు. పెద్ద స్క్రీన్పై వచ్చే పీరియాడికల్ యాక్షన్ సినిమాలకు ఏఐ అంతగా సూట్ కాదని, నిజమైన వీఎఫ్ఎక్స్తోనే మంచి ఫలితం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
స్వయంభు సినిమా ఒక పల్లెటూరి యువకుడు యోధుడిగా ఎలా మారాడు? అతడిని ప్రేరేపించిన శక్తి ఏంటి? అన్న నేపథ్యంతో రూపొందుతోంది. ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నభా నటేశ్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.