Operation ArunaReddy: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 సినిమాలకు పైగా రచయితగా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న పోసాని కృష్ణ మురళి ఇప్పుడు మరో సంచలనానికి రెడీ అయ్యారు .ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “ఆపరేషన్ అరుణారెడ్డి” జూలై 17న థియేటర్లలోకి రాబోతుంది .ఈ సందర్భంగా హైదరాబాదులో ఘనంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీం.ఇక ఈ సినిమాకి కేవలం దర్శకత్వ బాధ్యతలే కాకుండా కథ,స్క్రీన్ ప్లే ,మాటలతో పాటు ఏకంగా పాటలు,ఎడిటింగ్ బాధ్యతలను కూడా స్వయంగా పోసాని చూసుకోవడం ఇక్కడ విశేషం.
మంచి గుర్తింపునిస్తుందన్న మూవీ టీమ్
100 సినిమాలకు పైగా రచయితగా పనిచేసి, ఎన్నో సినిమాల్లో నటుడిగా సత్తా చాటిన పోసానికి ఈ సినిమా ఒక మంచి గుర్తింపునిస్తుందని నమ్ముతుంది మూవీ టీమ్.ఇక ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన మహదేవ్ ఏలేందర్ మాట్లాడుతూ ఈ సినిమా పోసాని కెరీర్లో పోసాని 2.0ని ఆవిష్కరిస్తుందని చెప్పుకొచ్చాడు .ఈ సినిమా కోసం పోసాని ఎన్నో వెర్షన్లు రాశారని తెలిపారు .
ఈ సినిమా గురించి పోసాని మాట్లాడుతూ నా జీవితంలో 100 సినిమాలకు పైగా రాశాను, నటుడిగా వందల పాత్రలు వేశాను కానీ వాటన్నింటి కంటే ఆపరేషన్ అరుణారెడ్డి సినిమాకే ద బెస్ట్ స్క్రీన్ పై ఇచ్చానని సగర్వంగా చెప్పగలనని తెలిపాడు పోసాని.ఇక థియేటర్లో సినిమా మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు ప్రేక్షకుడు ఆ తర్వాత సీనేంటో అస్సలు ఊహించలేడంటూ సినిమాపై అంచనాలు పెంచేశాడు.
బలమైన పాత్రలో కనిపించబోతున్న హిందోళ చక్రవర్తి
ఇక ఇందులో ఒక బూతు మాట కానీ అశ్లీలత కానీ ఉండదని, కుటుంబమంతా కలిసి ఈ సినిమాని చూసేలా చాలా సిన్సియర్ గా తీశానని చెప్పుకొచ్చాడు పోసాని .ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన హిందోళ చక్రవర్తి మాట్లాడుతూ ఒక మంచి మెసేజ్ ఇచ్చే బలమైన పాత్రలో కనిపించబోతున్నానని, సొసైటీలోని లోపాలను ప్రశ్నిస్తూనే ప్రేక్షకులను నవ్విస్తానని తెలిపింది.ఇక సెకండ్ లీడ్ రోల్ పోషించిన కాజల్ శర్మ మాట్లాడుతూ అరుణారెడ్డి స్నేహితురాలిగా తను చేసిన పాత్ర సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్తుందని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసింది .
ఇక ఈ సినిమాకు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే ప్రముఖ బిజెపి నేత ,మెదక్ ఎంపీ రఘునందన్ రావు కీలకపాత్రలో కనిపిస్తుండడం.ఇక ఈ సినిమాకి పోసానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన నిర్మాత శ్రీనివాస్ భవిష్యత్తులో పోసానితో ఏడాది కనీసం రెండు సినిమాలు చేయడానికి సిద్ధమవడం విశేషం.యుపి సినిమా లైన్స్, కుసుమ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై 3 ఇడియట్స్ మూవీస్ సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమా జులై 15 థియేటర్లకి రాబోతుంది.
చూడాలి మరి ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కుతానని ఫిక్స్ అయిన పోసాని బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని రాబడతాడో !