Lafoot Gang Movie Producer: సినిమా నిర్మాతను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేయడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆయన ఎవరో కాదు ‘లఫూట్ గ్యాంగ్’ మూవీ నిర్మాత కే.లక్ష్మీకాంత్ రెడ్డి (K. Lakshmi Kanth Reddy)ముఖ్యంగా అమాయకులను టార్గెట్ గా చేసుకొని.. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని చెప్పి గోల్డ్ స్కాం లో భారీ మోసాలు చేసినందుకు గానూ హైదరాబాద్ పోలీసులు ఈయనను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే 4 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న లఫూట్ గ్యాంగ్ సినిమా నిర్మాత ఇప్పుడు ఏకంగా 2 కోట్ల రూపాయల గోల్డ్ స్కామ్ లో ఇరుక్కొని అందరిని ఆశ్చర్యపరిచారు. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అసలు విషయంలోకి వెళ్తే.. లఫూట్ గ్యాంగ్ సినిమా నిర్మాత కే లక్ష్మీకాంత్ రెడ్డి 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లను తక్కువ ధరకు ఇప్పిస్తానని నమ్మించి, విడతల వారీగా రూ.2.21 కోట్లు తీసుకొని బంగారం ఇవ్వకుండా, డబ్బును తిరిగి చెల్లించకుండా మోసం చేసినట్లు బాధితుడు రాకేష్ బలరాం (Rakesh Balaram)తన కంప్లైంట్ లో ఆరోపించారు. తన డబ్బు మొత్తం తిరిగి ఇవ్వాలని అడిగితే.. తనతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా బెదిరించి, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ దారుణంగా ఇబ్బంది పెట్టినట్లు బాధితుడు పోలీస్ స్టేషన్లో తన ఆవేదన వ్యక్తపరిచారు.
ముఖ్యంగా హైదరాబాదులోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను అక్కడ తగిన చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించగా.. రూ.2.21కోట్లు కావడంతో దర్యాప్తును ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కు అనంతరం సీసీఎస్ , హైదరాబాద్ కి బదిలీ చేశారు. దీంతో సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగి లక్ష్మీకాంత్ రెడ్డిని అరెస్టు చేసి, నాంపల్లి XII అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా.. కోర్టు 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఇక బాధితుడు రాకేష్ బలరాం గౌడ్ తరఫున హైకోర్టు అడ్వకేట్ నాగూర్ బాబు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ALSO READ: నూకరాజు పై రెచ్చిపోయిన రాకింగ్ రాకేష్.. ఏమైందంటే?
ఇదిలా ఉండగా లక్ష్మీకాంత్ రెడ్డి పై ఇదివరకే నాలుగు క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఎఫ్ఐఆర్ లో నమోదయింది. రాయదుర్గం, కోయిల్ కొండ, మహంకాళి పిఎస్, హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో కేసుల నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.
లక్ష్మీ కాంత్ రెడ్డి నిర్మిస్తున్న లఫూట్ గ్యాంగ్ సినిమా విషయానికొస్తే.. అనురాగ్ అధర్వరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లఫూట్ గ్యాంగ్. ఈ ఏడాది మే నెలలో హైదరాబాద్లో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 1990ల కాలంలో ఒక హాస్టల్ నేపథ్యంలో సాగే ఈ కథలో యువకుల గ్యాంగ్ చేసే అల్లరి, వారి స్నేహం , సరదా సంఘటనలు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నట్లు తెలిపారు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగు ప్రారంభం అయింది. ఈ చిత్రానికి కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి నిర్మాతగా.. వర్ధన్ మయూర్ కొయ్యాడా సినిమాటోగ్రాఫర్ గా, ఆర్ఆర్ ధృవన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. పైగా ఈ సినిమా పూజా కార్యక్రమానికి దర్శకుడు పవన్ సాధినేని, నిర్మాత బివిఎస్ రవి, హీరోలు రాజ్ తరుణ్, ఆకాశ్ పూరీ , నటుడు అలీ తదితరులు హాజరై సందడి చేశారు. అయితే షూటింగ్ ప్రారంభమై నెల కూడా కాలేదు. అప్పుడే నిర్మాత ఇలా అరెస్టు కావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.