Krishna Vamsi: నిన్నే పెళ్ళాడతా, మురారి లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కృష్ణవంశీ . సహజత్వం, భావోద్వేగాలు, బలమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఆయన ప్రయాణం దశాబ్దాలుగా కొనసాగుతోంది. అయితే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన తన కెరీర్ గురించి చాలా నిజాయితీగా మాట్లాడారు. విజయాలతో పాటు వైఫల్యాల్ని కూడా స్వయంగా అంగీకరిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
తన సినీ ప్రయాణంలో దాదాపు 20 సినిమాలు చేసిన కృష్ణవంశీ, వాటిలో రెండు సినిమాలను తానే “చెత్త సినిమాలు”గా అభివర్ణించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ సినిమాలు ఏవంటే మొగుడు.. పైసా. ఈ రెండు చిత్రాలు తన ఆశించిన స్థాయిలో రాకపోవడానికి పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని ఆయన స్పష్టంగా చెప్పారు. “నా అసమర్థత, నా అసహాయత, నా పరాజయం వల్లే ఆ సినిమాలు అలా అయ్యాయి” అని ఆయన చెప్పిన మాటలు దర్శకుడిగా ఆయన నిజాయితీని చూపిస్తాయి.
ప్రత్యేకంగా మొగుడు సినిమా గురించి మాట్లాడుతూ.. మొదట ఆ ప్రాజెక్ట్ను చాలా నమ్మకంతో ప్రారంభించా.. కానీ షూటింగ్ మొదలైన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. కొంతమంది వ్యక్తుల ప్రవర్తన, వారి ఆలోచనలు, ప్రొడక్షన్ సమస్యలు తన క్రియేటివ్ ఆలోచనలపై తీవ్ర ప్రభావం చూపాయని అన్నారు. “ఆ సినిమా షూటింగ్ సమయంలో ఎప్పుడు పూర్తవుతుందా అని.. దేవుడిని కోరుకునే స్థితి వచ్చింది” అని చెప్పడం ఆయన ఎదుర్కొన్న మానసిక ఒత్తిడిని తెలియజేస్తుంది. ఆ అనుభవాన్ని తన జీవితంలో ఒక చేదు అధ్యాయంగా పేర్కొన్నారు.
వైఫల్యాల గురించి ఇలా ఓపెన్గా మాట్లాడిన కృష్ణవంశీ, తనకు గర్వకారణమైన సినిమాల గురించి కూడా వివరించారు. చందమామ సినిమాను తన కెరీర్లో టాప్ స్థానంలో ఉంచారు. అలాగే మురారి, అంతఃపురం, ఖడ్గం, డేంజర్ వంటి చిత్రాలను తన బెస్ట్ వర్క్స్గా పేర్కొన్నారు. ముఖ్యంగా డేంజర్ సినిమా విషయంలో, కేవలం 80 లక్షల బడ్జెట్లో ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా మంచి అవుట్పుట్ ఇవ్వగలిగానని చెప్పారు.
విజయం అయినా వైఫల్యం అయినా రెండింటినీ సమానంగా స్వీకరించడమే నిజమైన కళాకారుడి లక్షణం. ఆ విషయంలో కృష్ణవంశీ మరోసారి తన గొప్పతనాన్ని నిరూపించారు.
ALSO READ: Venkatesh – Anil Ravipudi: వెంకటేష్–అనిల్ రవిపూడి కొత్త సినిమా కథ ఇదే.. ఫహాద్ ఫాజిల్ పాత్ర ఏమిటంటే?