Varanasi: ఇండియన్ సినిమా పరిశ్రమలో ఇప్పుడు అందరి చూపు ఒకే సినిమాపై ఉంది. అదే దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి మరియు హీరో మహేష్ బాబు కలిసి చేస్తున్న భారీ చిత్రం వారణాసి. ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న ప్రాజెక్ట్గా ప్రచారం పొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించిన ప్రకారం, వారణాసి వచ్చే ఏడాది ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ విడుదల తేదీని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ప్రమోషన్ ప్లానింగ్, మార్కెటింగ్ పనులు మొదలయ్యాయి. మహేష్ బాబు అభిమానులు ఈ సినిమాను ఒక మైలురాయిగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇది ఆయన కెరీర్లోనే అత్యంత భిన్నమైన పాత్రగా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది.
అయితే, ఇక్కడ ఒక ప్రధాన ప్రశ్న అందరి మనసుల్లో ఉంది. అదేంటంటే… రాజమౌళి ఈసారి అయినా సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయగలరా? గతంలో ఆయన తెరకెక్కించిన చాలా సినిమాలు ప్రకటించిన తేదీలకు ఆలస్యంగా విడుదలయ్యాయి. భారీ సెట్లు, పెద్ద యాక్షన్ సన్నివేశాలు, క్లిష్టమైన విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ వల్ల షెడ్యూల్స్ పొడవుగా మారడం సాధారణంగా జరిగేది.
కానీ వారణాసి విషయంలో పరిస్థితి కొంత భిన్నంగా ఉందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ పనులను ఒకే కంపెనీకి కాకుండా, అనేక అంతర్జాతీయ వీఎఫ్ఎక్స్ సంస్థలకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇలా ఇంతకుముందు సినిమాలకు ఎప్పుడు కూడా రాజమౌళి చేయలేదు. ప్రతి సినిమాకి ఒకే కంపెనీకి ఈ బాధ్యతలు ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం ఇలా వివిధ కంపెనీలకు ఇచ్చారు. దీని వల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. బడ్జెట్ కొంచెం పెరిగినా, సమయానికి సినిమా పూర్తి చేయాలన్నదే మేకర్స్ లక్ష్యంగా కనిపిస్తోంది.
అన్నీ అనుకున్నట్లే జరిగితే, రాజమౌళి కెరీర్లో తొలిసారిగా ఎలాంటి వాయిదా లేకుండా విడుదలయ్యే సినిమా ఇదే కావచ్చు. అదే జరిగితే, అది ఆయనకు కూడా, మహేష్ బాబు అభిమానులకు కూడా ఒక ప్రత్యేకమైన ఘనతగా నిలుస్తుంది. ఇప్పుడు చూడాల్సింది ఒక్కటే… రాజమౌళి ఈసారి టైమ్లైన్ను బ్రేక్ చేసి చరిత్ర సృష్టిస్తారా లేదా అన్నది.
ALSO READ: MBU వివాదంపై స్పందించిన యాజమాన్యం..15 లక్షలు డిమాండ్ చేశారంటూ..!