పరిశుభ్రత లేకపోవడంతో తనకు తీవ్రమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని మహిళ తెలిపింది. దీనిపై ఎయిర్లైన్ స్పందించింది. ఈ విషయాన్ని సమీక్షిస్తున్నామని తెలిపింది.
డిసెంబర్ 26న బెంగళూరు నుంచి అహ్మదాబాద్కు స్నేహితులతో ప్రయాణించిన జాహాన్వి త్రిపాఠి అనే మహిళ లింక్డ్ఇన్లో తనకు ఎదురైన పరిస్థితిని పంచుకున్నారు. ఆకాసా విమానం రాత్రి 10:25 గంటలకు బయలదేరిందని, విమానంలో సౌకర్యవంతమైన ప్రయాణం ఉంటుందని ఆశించానన్నారు. కానీ విమానం లోపల అపరిశుభ్రత ఉన్న సీటింగ్ తన ప్రయాణాన్ని బాధాకరంగా మార్చిందన్నారు. సీట్ల అరెంజ్మెంట్ కారణంగా తీవ్రమైన అసౌకర్యం కలిగిందన్నారు. దీంతో తనకు తీవ్రమైన మోకాళ్ల నొప్పి వచ్చిందన్నారు. తన స్నేహితులు కూడా ఇలాంటి అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారన్నారు.
ప్రయాణం తర్వాత కొద్దిసేపటికే తన కాళ్లకు తీవ్రమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని, అది క్రమంగా తీవ్రమైందని త్రిపాఠి ఆరోపించారు. ఈ పరిస్థితి వల్ల తాను సరిగ్గా నడవలేకపోతున్నానని, నిద్రపోలేకపోతున్నానన్నారు. ప్రస్తుతం వైద్య చికిత్స తీసుకుంటున్నానని చెప్పారు. ఈ ప్రయాణం తనను శారీరకంగా, మానసికంగా చాలా అలసిపోయేలా చేసిందన్నారు.
విమానంలో అపరిశుభ్రమైన సీటింగ్, క్యాబిన్ పరిస్థితుల కారణంగా తనకు ఇన్ఫెక్షన్ సోకి ఉండవచ్చని త్రిపాఠి ఆరోపించారు. ఈ విషయాన్ని దర్యాప్తు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె ఎయిర్ లైన్స్ ను కోరారు.
త్రిపాఠి ఆరోపణలపై ఆకాశ ఎయిర్ స్పందించింది. ఆమెకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామన్నారు. తాము ప్రయాణికులకు అత్యున్నత స్థాయి పరిశుభ్రత కస్టమర్ శ్రేయస్సుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఆమెకు జరిగిన అసౌకర్యంపై తక్షణమే సమీక్షించి, వీలైనంత త్వరగా తిరిగి సంప్రదిస్తామని ఎయిర్లైన్ తెలిపింది.
ఈ ఘటన ఆన్లైన్లో చర్చకు దారితీసింది. కొంతమంది విమానంలో అపరిశుభ్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరు విమానం ప్రయాణం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందనే వాదనను ప్రశ్నించారు. విమాన క్యాబిన్లు పూర్తి పరిశుభ్రతతో ఉంటాయని, ఇన్ ఫెక్షన్లు సోకే అవకాశం ఉండదని అంటున్నారు.