Bengal Tiger: పులి కేవలం ఒక క్రూర మృగం మాత్రమే కాదు. అది అడవికే అంతరాత్మ. దట్టమైన కీకరారణ్యంలో దాని సంచారం, మెరుపు కదలికలను బట్టీ అడవి ఎంత ఆరోగ్యకరంగా ఉందో చెప్పొచ్చు. పులిలేని అడవి అస్సలు ఊహించనలవి కానిది. పులి గర్జన, భీకర అరుపులు, జాడ, లేని వనం అసలు వనమే కాదు. ఆ అడవికి అసలు అందముండదు. పులి సంచారమే ఆ అడవికి అసలు సిసలు చిరునామా. ఇదీ అటవీ శాఖాధికారులు చెప్పే మాట.
ఆహార గొలుసులో పులి పాత్ర.. ఒక విశ్లేషణ
వేటాడే జీవుల్లో పులులు అగ్రశ్రేణి జంతువులు. అడవిలోని ఆహార గొలసుకట్టులో వీటిది కీలక పాత్ర. దుప్పి, జింక, అడవిపంది వంటి శాకాహార జీవులను నియంత్రించడమే పులుల ప్రధాన కర్తవ్యం. పులులే లేక పోతే శాకాహార జీవులు అమాంతం పెరిగిపోతాయి. దీంతో అడవి నాశనమై పోతుంది. అదేం లెక్క? అని చూస్తే.. శాకాహార జీవులు పెరిగినపుడు అడవిలోని వృక్ష సంపద యధేచ్చగా తినేస్తాయి. లేలేత మొక్కలు, పొదలు, చెట్లు, చిగుళ్లు పూర్తిగా నాశనమవుతాయి. అంతగా ఈ శాకాహార జీవులు అడవిని నమిలి మింగేస్తాయి. ఇందువల్ల అడవి అంతరించిపోతూ వస్తుంది. కొత్త మొక్కలు కూడా పెద్దగా మొలకెత్తవు. క్రమంగా అడవి తన పచ్చదనం కోల్పోతుంది. దీంతో అడవి బీడుగా మారుతుంది. మొత్తంగా అడవి అంతరించి పోయి.. జంతుజాలం జీవించడానికి వీల్లేకుండా పోతుంది.
పులి లేని అడవి.. నిశ్శబ్ధానికి చిరునామా
అడవుల్లో పులులు లేకపోతే దాని జీవ వైవిధ్యం తీవ్రంగా దెబ్బ తింటుంది. వేటాడే పులి లేక పోతే మొత్తం పర్యావరణ వ్యవస్థ తలకిందులవుతుంది. పచ్చదనం కోల్పోయిన అడవిలో జంతు జాలమే కాదు వృక్ష జాలం కూడా కనుమరుగవుతోంది. అడవిలో వినిపించే అసలైన ప్రాకృతిక సంగీతం.. మరేదో కాదు, పక్షుల కిలకిలా రావాలు, కీటకాల సవ్వడులు, జంతువుల అరుపులు. ఇవన్నీ లేక పోవడంతో అడవి నీరవ నిర్జీవంగా మారుతుంది. తద్వారా నిశ్శబ్ధం రాజ్యమేలుతుంది. అందుకే పులి ఉండాలనేది. అడవి అనే వ్యవస్థకు పులిని గుండెకాయగా అంచనా వేస్తారు అటవీశాఖ అధికారులు.
ఇంతకీ అడవిని వదిలి పులులెందుకు బయటకు వస్తున్నాయి
ఇంతకీ అడవిని వదిలి పులులెందుకు బయటకు వస్తున్నాయని చూస్తే.. ఈ శాకాహార జంతువులకన్నా మించి.. మనుషుల జాడ అడవిని విధ్వంసం చేస్తోంది. మనుషులు అడవి బాట పట్టడంతోనే పులులు ఊళ్ల బాట పడుతున్న దృశ్యం కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు. గత యాభై అరవై ఏళ్లుగా.. జంగిల్ కాస్తా కాంక్రీట్ జంగిల్ గా మారిపోతూ వస్తోంది. ప్రస్తుతం భారత దేశ విస్తీర్ణాన్నిబట్టీ చూస్తే ఉన్న అడవుల శాతం.. 25గా ఉంది. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్- 2023 లెక్కల ప్రకారం.. తేలిందీ లెక్క. అత్యధిక అడవులున్న రాష్ట్రాల విషయానికి వస్తే మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ గా చెబుతున్నాయి లెక్కలు. ఇక అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న స్టేట్ మీజోరాం. ఇదిలా ఉంటే.. ఈ అడవులు గతంలో ఉన్నంత ఆరోగ్యకరంగా లేవు. ఇవన్నీ ప్రభుత్వ రికార్డుల్లో మాత్రమే పచ్చగా ఉంటాయి. మన వాళ్లు యూకలిప్టస్, పామాయిల్, వెదురు వంటి కమర్షియల్ చెట్లను అడవులను నరికేసి మరీ పెంచుతున్నారు. ఇక కలప నరికివేత సంగతి సరే సరి. కేవలం ఇదే కాదు.. అడవుల్లోని ఏ సహజ సిద్ధ సంపదనీ వదలడం లేదు. రేయింబవళ్లు.. పెద్ద పెద్ద ఫ్లడ్ లైట్ వెలుగుల్లో బండ్లు కలయదిరుగుతుంటే.. జంతువులకు కనీస నిద్ర కూడా కరవైన పరిస్థితి.
అడవి ఖాళీ.. గ్రామాల వైపు పులుల అడుగులు
చివరికి గడ్డి కూడా మొలవడం లేదు. ఎక్కడ గడ్డి ఏపుగా ఉంటుందో అక్కడ శాకాహార జంతువుల జాడ కనిపిస్తుంది. దీంతో వీటిని ఆశించి పులులు వాటిపై దాడి చేసి ఆకలితీర్చుకుంటాయి. గడ్డి, పచ్చదనం, ఇతర జంతుజాలం ఇదంతా ఒక గొలుసుకట్టు.. మనిషి అడవి లోలోపలికి పెద్ద పెద్ద యంత్రాలతో వెళ్తూ పోవడంతో అడవి ఛిద్రమై పోతోంది. దీంతో అడవి డొల్లగా మారుతూ వస్తోంది. ఎకో సిస్టమ్ దెబ్బ తినడంతో.. పులులు ఊళ్ల మీద పడుతున్నాయి. ఇక్కడైతే రైతులు తమ పాడి పంటల్లో భాగంగా పశువులను పెంచుతుంటారు. వీటిని ఆశించి అడవులను వదిలి పులులు గ్రామాల్లోకి వస్తున్నట్టుగా చెబుతున్నారు అధికారులు.
ఒక పులి ఉన్న చోట మరో పులి ఉండదు
పులలకు మరో ప్రధాన సమస్య కూడా ఉంటుంది. ఒక పులి ఉన్న చోట మరో పులి ఉండదు. ఇది టైగర్ కా హుకుం. వాటికంటూ కొన్ని బయోలాజికల్ ఫెన్సింగులు ఉంటాయి. ఒక పులి ఇది తన టెరిటరీగా తన మూత్రంతో ఒక రకమైన కంచె వేస్తుంది. ఆ వాసనకు మరో పులి అటు వైపునకు రాదు. ఇప్పుడివన్నీ కనుమరుగై పోయాయి. అడవి అంతటి ఆరోగ్యకరంగా లేదు. పులులు చెదిరిపోయి ఎక్కడంటే అక్కడ సంచరిస్తున్నాయి. ఆహార సమస్యలకు తోడు.. శారీరక సమస్యలు కూడా చాలానే ఉంటాయి. తమ జోడి వెతుక్కోవడం కోసం.. అడవి దాటి బయటకు వచ్చేస్తుంటాయి. దీంతో పులుల సంచారం ఊళ్లలో ఎక్కువగా కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు అటవీశాఖ అధికారులు.