Second Phase Lok Sabha Elections 2024 : రెండో విడత లోక్ సభ ఎన్నికల ప్రచారానికి బుధవారం (ఏప్రిల్ 24)తో తెరపడింది. శుక్రవారం (ఏప్రిల్ 26)న 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. రెండో విడత పోలింగ్ లో విధులు నిర్వహించే సిబ్బంది ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు.
రెండోవిడత ఎన్నికల్లో పోటీపడుతున్న అభ్యర్థులలో వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ, మథుర నుంచి హేమమాలిని, తిరువనంతపురం నుంచి శశిథరూర్, రాజీవ్ చంద్రశేఖర్, కోటా నుంచి ఓం బిర్లా, మీరట్ నుంచి అరుణ్ గోవిల్, మండ్య నుంచి కుమారస్వామి వంటి ప్రముఖులున్నారు.
Also Read : ఎన్నికలను మేం కంట్రోల్ చేయలేం.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు
కేరళలో 20 లోక్ సభ స్థానాలకు, కర్ణాటకలో 28, రాజస్థాన్ లో 13, మహారాష్ట్రలో 8, ఉత్తరప్రదేశ్ లో 8, మధ్యప్రదేశ్ లో 7, అస్సాంలో 5, బిహార్ లో 5, ఛత్తీస్ గఢ్ లో 3, పశ్చిమ బెంగాల్ లో 3, మణిపూర్, త్రిపుర, జమ్ము-కశ్మీర్ లలో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది.
పోలీసులు, కేంద్ర బలగాలు పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించాయి. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు కానుంది. తీవ్రమైన ఎండల నేపథ్యంలో బిహార్ లో రెండు గంటలు పోలింగ్ సమయాన్ని పెంచింది ఎన్నికల కమిషన్. ఐదు స్థానాలకు అక్కడ పోలింగ్ జరగనుండగా.. సాయంత్రం 6 గంటల వరకూ ఓటర్లకు ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది.