Cockroach Janata Party: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి ఆందోళనలతో హీటెక్కింది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ చేపట్టిన పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వందలాది మంది కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా పార్లమెంట్ భవనం వైపు దూసుకురావడంతో జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసర ప్రాంతాలు రణరంగంగా మారాయి.
పోలీసుల లాఠీఛార్జ్.. మూతబడ్డ పార్లమెంట్ గేట్లు
ర్యాలీగా వస్తున్న ప్రదర్శకులను పోలీసులు జంతర్ మంతర్ వద్దే అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఆందోళనకారులు బారికేడ్లను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ ఘర్షణల్లో పలువురు సీజేపీ కార్యకర్తలతో పాటు, కొందరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. పరిస్థితి చేదాటిపోతుండటంతో అప్రమత్తమైన భద్రతాధికారులు ముందస్తు జాగ్రత్తగా పార్లమెంట్ ప్రధాన గేట్లను మూసివేశారు. పరిసర ప్రాంతాల్లో అదనపు బలగాలను రంగంలోకి దించారు.
కేంద్ర మంత్రి నడ్డాకు వినతిపత్రం.. 3 ప్రధాన డిమాండ్లు
ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమే కేంద్ర ప్రభుత్వం తమను చర్చలకు ఆహ్వానించిందని సీజేపీ ప్రతినిధులు వెల్లడించారు. పార్టీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు.
‘పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. పేపర్ లీకేజీల వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలి.
నీట్ పేపర్ లీక్ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి’ అంటూ కీలక డిమాండ్లు చేశారు.
సానుకూలంగా స్పందించిన కేంద్రం
సీజేపీ ప్రతినిధుల డిమాండ్లపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. వినతిపత్రంలో పేర్కొన్న అంశాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని పార్టీ ప్రతినిధులు తెలిపారు. కేంద్రం నుంచి స్పష్టమైన హామీ రావడంతో ప్రస్తుతానికి ఉద్రిక్తత కొంత సద్దుమణిగినట్లు కనిపిస్తోంది.
Also Read: పార్లమెంట్లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!