Supreme Court: వీవీప్యాట్ కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలను నియంత్రించే అధికారం తమది కాదని పేర్కొంది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలని దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
వీవీప్యాట్ కేసుపై నేడు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉండగా ఈ అంశంపై పలు సందేహాలు ఉండడంతో న్యాయస్థానం స్పష్టత కోరింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నలు సంధించింది.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అందులో భాగంగానే న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలను నియంత్రించే అధికారం తమకు లేదని తెలిపింది. ఎన్నికల సంఘం రాజ్యాంగ సంస్థ అని అందుకే దాని పనితీరును తాము నిర్దేశించలేమని పేర్కొంది.
Also Read :దేశాన్ని విభజిస్తామంటూ మోదీ తప్పుడు ఆరోపణ.. రాహుల్ గాంధీ క్లారిటీ
ఈవీఎంలో మైక్రో కంట్రోలర్ ఎక్కడ ఉంటుంది..కంట్రోలింగ్ యూనిట్లోనా లేదా వీవీప్యాట్లోనా? అని ఎన్నికల సంఘాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. మైక్రో కంట్రోలర్ అనేది ఒకసారి రూపొందించిన ప్రోగ్రామా, కాదా? అన్నది తెలపాలని కోరింది. కోర్టు ఆదేశాల మేరకు ఈసీ అధికారులు న్యాయస్థానం ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. ఎన్నికల సంఘం వివరణను పరిశీలించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.