Delhi Fire Accident: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి చెందారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. వ్యాపారవేత్త రాజేందర్ కశ్యప్ తన భార్య, ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె, నలుగురు కోడళ్లు, ఏడుగురు మనవలతో కలిసి పాలెంలోని నాలుగు అంతస్తుల భవనంలో నివసిస్తున్నారు. కశ్యప్ కుటుంబం నివసిస్తున్న ఇంటి బేస్ మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ లో క్లాత్, కాస్మోటిక్స్ షోరూమ్ నిర్వహిస్తున్నారు. ఆ కుటుంబం పై అంతస్తులో నివసించేది. అనుకోని ప్రమాదంతో ఆ కుటుంబం మొత్తం సజీవ దహనం అయ్యారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి భవనం అంతటికీ వ్యాపించాయి. భవనం గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక షాపులో మంటలు చెలరేగాయని తెలుస్తోంది. అలాగే మొదటి అంతస్తులో ఒక గోడౌన్ ఉండడంతో మంటలు తీవ్రంగా వ్యాపించాయి. కశ్యప్ తన ఐదుగురు కుమారులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి రెండో, మూడో అంతస్తులలో నివసిస్తుండేవారు. మంటలు వేగంగా విస్తరించడంతో పై అంతస్తులలో ఉన్న వారు తప్పించుకోలేకపోయారు. షాపులకు నిర్వహిస్తున్న ఈ భవనంలో కేవలం ఒకే ఎంట్రీ, ఎగ్జిట్ ఉండడం గమనార్హం.
మృతుల్లో కశ్యప్ భార్య లాడో(70), అతని కుమారులు ప్రవేశ్ (33), కమల్ (39), కుమార్తె హిమాన్షి (22), కోడళ్లు అషు (35), దీపిక (28), పదిహేను, ఆరు, మూడు సంవత్సరాల వయస్సు గల మనవరాళ్లు ఉన్నారు.కశ్యప్ కుమారుడు అనిల్ (32), తన రెండేళ్ల కుమార్తెను సహాయక సిబ్బందికి అందించే ప్రయత్నంలో కింద పడేసి, ఆ తర్వాత అతడు కిందకు దూకేశాడు. వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కశ్యప్ చిన్న కుమారుడు సచిన్ (29) తనను తాను రక్షించుకోవడానికి పక్కనే ఉన్న భవనంలోకి దూకడంతో 25 శాతం కాలిన గాయాలయాలతో బయటపడ్డాడు. కశ్యప్ కుమారులలో ఒకరు తన భార్య, పిల్లలతో కలిసి సిమ్లాలో విహారయాత్రకు వెళ్లినందున ఆ విషాదం నుంచి తప్పించుకున్నారని బంధువులు తెలిపారు.
భవనంలో ఎక్కువ మొత్తంలో పెర్ఫ్యూమ్ లు, సౌందర్య సాధనాలు ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. కొన్ని నిమిషాల్లోనే మంటలు కింది అంతస్తు నుంచి మూడో అంతస్తు వరకు వ్యాపించాయని తెలిపారు. కింద దిగే మార్గం ఇరుకుగా ఉండటంతో పాటు, పైకప్పు పై విద్యుత్ తీగలు అడ్డంగా ఉండడంతో ఫైర్ ఫైటర్స్ చేరుకునేందుకు సమయం పట్టిందని తెలిపారు.
ఈ ఘోర ప్రమాదంపై దిల్లీ సీఎం రేఖా గుప్తా మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. పాలెంలోని అపార్ట్మెంట్ లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం గురించి తెలుసుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకే కుటుంబంలో మూడు తరాలకు చెందిన తొమ్మిది మంది మరణించడం, చిన్న నిర్లక్ష్యం విపత్తులకు ఎలా దారితీస్తుందో ఈ ఘటనతో మరోసారి స్పష్టం అవుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో అగ్ని ప్రమాదాలు విషాదకరంగా మారుతున్నాయి. అగ్నిమాపక భద్రతా నిబంధనల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. రద్దీగా ఉండే ప్రాంతాలలో, అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు అందేలా తగిన విధంగా నిర్మాణాలు ఉండడంలేదని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.