Kerala Doctors: కేరళలో మానవత్వానికి మారుపేరుగా నిలిచే ఒక అద్భుత సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగా ఆపరేషన్ అంటే అత్యాధునిక పరికరాలు, స్టెరిలైజ్ చేసిన థియేటర్, సరిపడా వెలుతురు ఉండాలి. కానీ, చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఒక వ్యక్తిని చూసి, ముగ్గురు వైద్యులు నిబంధనల కంటే ప్రాణం ముఖ్యమని భావించారు. ఎటువంటి సౌకర్యాలు లేని చోట, కేవలం తమ నైపుణ్యంతో ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టి “వైద్యో నారాయణో హరిః” అనే మాటకు నిజమైన అర్థాన్ని ఇచ్చారు.
ఆదివారం ఉదయం ఎర్నాకులంకు చెందిన డాక్టర్ థామస్ పీటర్, ఆయన భార్య డాక్టర్ దిడియా థామస్ చర్చికి వెళ్తుండగా, పెరూర్ సమీపంలో ఒక ఘోర రోడ్డు ప్రమాదాన్ని గమనించారు. అక్కడ రక్తపు మడుగులో ఉన్న బాధితులలో ఒకరి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. తీవ్ర రక్తస్రావం కారణంగా ఆ వ్యక్తి నిమిషాల్లో ప్రాణాలు కోల్పోయేలా ఉన్నాడని గ్రహించిన ఆ దంపతులు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రంగంలోకి దిగారు.
సరిగ్గా అదే సమయంలో కోటయం మెడికల్ కాలేజీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి మనోజ్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ ముగ్గురు వైద్యులు బాధితుడి పరిస్థితిని సమీక్షించి, అతన్ని ఆసుపత్రికి తరలించే వరకు వేచి చూస్తే ప్రాణాలు దక్కవని నిర్ధారణకు వచ్చారు. దీంతో, అంబులెన్స్ వచ్చేలోపే అక్కడికక్కడే ఎమర్జెన్సీ సర్జరీ చేయాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
చుట్టూ ఉన్న స్థానికులు, పోలీసులు కూడా వైద్యులకు పూర్తి సహకారం అందించారు. ఆపరేషన్ థియేటర్ లైట్లకు బదులుగా, స్థానికులు తమ మొబైల్ ఫోన్ టార్చ్లను వెలిగించి వెలుతురును అందించారు. ఆ చిన్నపాటి వెలుతురులోనే, రోడ్డు పక్కనే ఉన్న నేలపైనే ఆ ముగ్గురు వైద్యులు అత్యంత క్లిష్టమైన ప్రక్రియను కేవలం నాలుగు నిమిషాల్లో పూర్తి చేశారు. రక్తస్రావాన్ని అరికట్టి బాధితుడి ప్రాణాన్ని నిలకడగా మార్చారు.
వైద్యులు చూపిన ఈ సమయస్ఫూర్తి, ధైర్యం సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. కేరళ ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీషన్ ఈ విషయాన్ని తన ఫేస్బుక్ ద్వారా వెల్లడించడంతో ప్రపంచానికి తెలిసింది. విపత్కర పరిస్థితుల్లో వృత్తి ధర్మాన్ని మించి మానవత్వాన్ని చాటిన డాక్టర్ థామస్, డాక్టర్ దిడియా, డాక్టర్ మనోజ్లను ఆయన స్వయంగా ఫోన్ చేసి ప్రశంసించారు.
Also Read: ఆర్డీవో ఆఫీసర్ కిషన్ నాయక్ ఇంట్లో ఏసీబీ దాడులు.. ఆస్తులను చూసి ఏసీబీ షాక్..
ప్రస్తుతం ఆ బాధితుడు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఆపదలో ఉన్నప్పుడు భయపడకుండా, అందుబాటులో ఉన్న వనరులతోనే ప్రాణాలు కాపాడిన ఈ ముగ్గురు వైద్యులను నెటిజన్లు “నడిచే దేవుళ్లు” అని కొనియాడుతున్నారు. వైద్య పరికరాల కంటే వైద్యుడి సంకల్ప బలం గొప్పదని నిరూపించిన ఈ ఘటన అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది.