Jammu Kashmir: సరిహద్దు వెంబడి ఉగ్రవాద కదలికలు జోరందుకున్న నేపథ్యంలో పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరిక చేశారు. ఇది జరిగిన కొద్దిగంటలకు కీలక పరిణామం చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్కి చెందిన డ్రోన్లను భద్రతా దళాలు గుర్తించడం, ఆపై కాల్పులు జరపడం చకచకా జరిగిపోయింది.
జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో డ్రోన్ల కలకలం
జమ్మూకాశ్మీర్లోని నియంత్రణ రేఖ-ఎల్ఓసీ వెంబడి పాకిస్తాన్కి చెందిన డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. రాజౌరి జిల్లాలోని కేరి సెక్టార్, దూంగా గాలి ఏరియాల్లో అర్ధరాత్రి సమయంలో డ్రోన్లు సంచరిస్తున్నట్లు గుర్తించాయి బలగాలు. దీంతో కొద్ది గంటలపాటు అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సరిహద్దుల నుంచి వచ్చిన డ్రోన్ల ద్వారా ఆయుధాలు లేకుంటే మాదకద్రవ్యాలను తరలించే ప్రయత్నం జరుగుతున్నట్లు బలగాలు అనుమానిస్తున్నాయి. పదేపదే డ్రోన్లు హంగామా చేయడంతో భారత సైన్యం రియాక్ట్ అయ్యింది. వాటిని అడ్డుకునేందుకు కాల్పులు జరిపాయి. ఆ తర్వాత డ్రోన్లు అదృశ్యమైనట్టు బలగాలు తెలిపాయి.
అప్రమత్తమైన బలగాలు.. ఆపై కాల్పులు, గాలింపు
డ్రోన్ల ద్వారా నిషేధిత వస్తువులు ఏమైనా జార విడిచి ఉంటారేమోనన్న అనుమానంతో ఆయా ప్రాంతాల్లో గాలింపు చేపట్టాయి. ఆ ప్రాంతమంతా అటవీ ప్రాంతం కావడంతో ఓ వైపు గాలింపు చేస్తూ మరోవైపు డ్రోన్ల సాయంతో జల్లెడ పడుతున్నారు. రాజౌరి సెక్టార్లో 48 గంటల్లో ఇలాంటి ఘటన జరగడం రెండోసారి.
ఎల్ఓసీతో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి డ్రోన్ కార్యకలాపాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బలగాలను అప్రమత్తం చేశారు. అలాగే గస్తీ కూడా కట్టదిట్టం చేశారు. గతేడాది మే నెలలో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాత వరుసగా డ్రోన్లు కనిపించడం ఇదే తొలిసారి. చలికాలంలో మంచు విపరీతంగా కురుస్తున్న నేపథ్యంలో డ్రోన్ల ద్వారా అక్రమ రవాణాకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ALSO READ: ఓ వైపు బంగారం.. మరోవైపు మల్లెపూలు, రికార్డు స్థాయిలో ధరలు
ఎల్ఓసీ వెంబడి అన్ని చెకింగ్ పాయింట్ వద్ద హైఅలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో నిఘా కట్టుదిట్టం చేశారు. అంతేకాదు యాంటీ-డ్రోన్ వ్యవస్థను విస్తృతంగా వినియోగిస్తున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు భద్రతను కట్టుదిట్టం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పెట్రోలింగ్ చేపడుతున్నారు.