Sleeper Bus Rape: ఉత్తర ప్రదేశ్ నుంచి ఢిల్లీ వైపు వెళ్లే ఒక స్లీపర్ బస్సులో 16 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన దారుణ గ్యాంగ్ రేప్ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు ముందు సదరు బస్సుపై అనేక రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉన్నట్లు తాజాగా బయటపడింది. గత జులైలో 23 రోజుల వ్యవధిలో ఆ బస్సుపై ఏకంగా రూ.56,000 విలువైన 9 చలాన్లు నమోదైనట్లు వెల్లడైంది.
బాలికపై అఘాయిత్యానికి వేదికగా నిలిచిన స్లీపర్ బస్సుపై.. మెుదటి కేసు ఈ ఏడాది ఏప్రిల్ 28న యూపీలోని ఫిరోజాబాద్ ఆర్టీఓ ఆఫీసులో రిజిస్టర్ అయింది. తర్వాత మే నెలలో యమునా ఎక్స్ప్రెస్వేపై రెండు చోట్ల అతివేగంగా వెళ్లినందుకు ఒక్కోదానికి రూ.4,000 చొప్పున చలాన్లు పడ్డాయి. ఆ తర్వాత జూన్లో నోయిడా సెక్టార్ 168 వద్ద ఇండికేటర్ వేయకుండా లైన్ మారినందుకు మరో చలానా విధించారు. జులై 1 నుంచి జులై 23 మధ్య యమునా ఎక్స్ప్రెస్వే, ఎత్మద్పూర్, హమీర్పూర్, ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయం సమీపంలో వరసగా అతివేగం, ట్రాఫిక్ ఉల్లంఘనల కింద భారీగా జరిమానాలు పడ్డాయి. జులై 8న ఒక్క రోజే హమీర్పూర్లో రూ. 26,000 చలాన్ పడటం గమనార్హం.
మైన్ పూర్ కి చెందిన 11వ తరగతి బాలిక.. తల్లి కోప్పడటంతో ఆగస్టు 4న రాత్రి వేళ నోయిడాలోని తన బంధువుల ఇంటికి బయలుదేరింది. భారీ వర్షం పడుతుండటంతో రాత్రి 9 గంటల సమయంలో గ్రేటర్ నోయిడాలోని పారి చౌక్ వద్ద పొరపాటున బస్సు దిగింది. ఆమెను గమనించిన స్లీపర్ బస్సు కండక్టర్.. సెక్టార్ 63కి వెళ్తున్నట్లు నమ్మబలికి బస్సులోకి ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత కదులుతున్న బస్సులోనే బాలికపై దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టి ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ వద్ద నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్లిపోయారు.
ఈ ఘోరంపై బాధితురాలు స్వయంగా పోలీసులను ఆశ్రయించడంతో అధికారులు తక్షణమే స్పందించి బస్సును స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి.. ఘటనకు కారణమైన డ్రైవర్, కండక్టర్లను అరెస్ట్ చేశారు. 2012 నాటి నిర్భయ ఘటనను గుర్తుచేస్తున్న ఈ కేసులో త్వరలోనే నిందితులపై చార్జిషీట్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
Also Read: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?
మరోవైపు ఈ దారుణంపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్పందించారు. మహిళలు, పిల్లల భద్రతపై కీలక ప్రకటన చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే బస్సుల జీపీఎస్ (GPS) వ్యవస్థలను ఢిల్లీ రవాణా శాఖ సిస్టమ్తో అనుసంధానించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. మహిళా ప్రయాణికుల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతామని వెల్లడించారు.
Also Read: వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు