India Africa Forum: ఆఫ్రికాలో ఎబోలా వైరస్ (Ebola Outbreak) విజృంభిస్తున్న నేపథ్యంలో వచ్చే వారం న్యూఢిల్లీలో జరగాల్సిన నాల్గవ ఇండియా – ఆఫ్రికా ఫోరమ్ సదస్సు (IAFS-IV) వాయిదా పడింది. మే 28 తేదీ నుంచి జరగాల్సిన ఈ సదస్సును తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అధికారికంగా ప్రకటించింది. భారత ప్రభుత్వం, ఆఫ్రికన్ యూనియన్ ఛైర్పర్సన్, ఆఫ్రికన్ యూనియన్ కమిషన్ సంయుక్తంగా చర్చించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత ఈ సదస్సు జరుగుతుండగా.. అనూహ్యంగా ఎబోలా రూపంలో దీనికి అడ్డంకి ఏర్పడటం గమనార్హం.
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ వంటి ఆఫ్రికా దేశాలలో వ్యాపిస్తున్న అరుదైన ఎబోలా స్ట్రెయిన్ (Bundibugyo variant) కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిని అంతర్జాతీయ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. భారత్ లో జరగాల్సిన సదస్సుకు సుమారు 40 ఆఫ్రికా దేశాల ప్రతినిధులు హాజరుకావాల్సి ఉండటంతో.. ప్రజారోగ్య భద్రత దృష్ట్యా దీనిని వాయిదా వేశారు. పరస్పర సంప్రదింపుల తర్వాత శిఖరాగ్ర సమావేశం కొత్త తేదీలను ఖరారు చేసి.. త్వరలో ప్రకటిస్తామని భారత ప్రభుత్వం తెలిపింది.
మరోవైపు ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. ఇప్పటి వరకూ దేశంలో ఎలాంటి ఎబోలా కేసు నమోదు కానప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. దేశంలోని అన్ని ఎయిర్పోర్టులు, సీపోర్టులలో హై-రిస్క్ ఆఫ్రికా దేశాల నుండి వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేక హెల్త్ డెస్క్లను ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్, క్వారంటైన్ ప్రోటోకాల్, వైద్య పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది.
Also Read: ఫ్రిడ్జ్ తెరవగానే బ్యాడ్ స్మెల్ వస్తోందా? ఈ 5 సింపుల్ ట్రిక్స్తో.. చెక్ పెట్టండి!
ఎబోలా అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన వైరల్ ఇన్ఫెక్షన్లలో ఒకటి. ఇది మనుషులకు, కోతులు, చింపాంజీలు వంటి జంతువులకు సోకుతుంది. ఈ వైరస్ను మొదటిసారిగా 1976లో ఆఫ్రికాలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఉన్న ‘ఎబోలా’ అనే నది సమీపంలో గుర్తించారు. అందుకే దీనికి ఆ నది పేరే పెట్టారు. ఎబోలా అనేది గాలి ద్వారా వ్యాపించే వైరస్ కాదు. ఇది కేవలం శరీర ద్రవాల (Body Fluids) ద్వారా మాత్రమే ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది. సోకిన వ్యక్తి రక్తం, లాలాజలం, వాంతులు, మూత్రం, చెమట నేరుగా వేరొకరి శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఎబోలా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Delhi: ఎబోలాపై కేంద్రం హెచ్చరికలు.. ఢిల్లీ ఎయిర్ పోర్టులో అడ్వైజరీ జారీ