అంతా మోడీ జపం చేస్తున్నారు. మోడీ సూచించిన పొదుపు మంత్రాన్ని జపిస్తున్నారు. హైదరాబాద్కు వచ్చి.. ఇక పై దేశం ఎటుపోతుందో తెలియదు.. ఆర్థిక కష్టాలు ఏ రేంజ్లో రాబోతున్నాయో కూడా ఊహించలేమనే రేంజ్లో భయపెట్టడమే కాదు.. ఇకపై మనం చాలా పొదుపుగా ఉండాలని హితబోధలు చేసి వెళ్లాడు మోడీ. వరాలిస్తాడేమో అనుకున్న తెలంగాణ జనం అవాక్కయ్యేలా.. అపశకునం మాటలు చెప్పి.. ఖర్చులన్నీ తగ్గించుకోండని, విలాసాలు వద్దు.. విహార యాత్రలూ వద్దు అంటూ పొదులు మాటలు చాలా విరివిగా బోధన చేసి ఇకపై మీ ఇష్టం అనే విధంగా మాట్లాడి వెళ్లిపోయారు. ఇక ఆయన ఇలా చెప్పి అలా వెళ్లాడో లేదో.. అన్ని రాష్ట్రాలు పోటీలు పడ్డాయి.
మోడీ చెప్పిన పొదుపును పాటించేందుకు. మోడీ దృష్టిలో పడేందుకు ఆయా రాష్ట్రాల నేతలు పట్టిన పొదుపు బాటలు.. జనాల్ని మరింత ఆందోళనకు, అయోమయానికి మాత్రం గురి చేశాయి. కానీ తెలంగాణ సర్కార్ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. తను చేయాల్సిన పనులు చేస్తూ పోతున్నది. ఇప్పటికే రేవంత్ రెడ్డి పలు వేదికల మీద.. చాలా సార్లు.. తెలంగాణ అప్పుల్లో ఉంది.. ఏమీ చేయలేకపోతున్నాం.. గత పాలకులు చేసిన తప్పిదం ఇది..! అని చెప్పి చెప్పి ఇక్కడి జనం మైండ్లో బాగా పొదపు మంత్రం నాడే వదిలారు. ఇక మళ్లీ మోడీ పొదుపు మంత్రం కూడా వళ్లెవేస్తే.. ఉన్న ఆర్థిక పరిస్థితి కూడా మరింత దివాళ తీసే ప్రచారానికి దారి తీస్తుందనే భయం ఉండనే ఉంది. అందుకే తెలివిగా.. మోడీ పొదుపు చర్యల పట్ల రేవంత్ తనదైన శైలిలో స్పందించారు. యుద్దం పేరు చెప్పి… దాని ప్రభావం ఉంటుందని భయపెట్టి జనాల్ని అయోమయానికి గురిచేయడం తగదనే విధంగా తనే మోడీకి హితబోధ చేయడం చర్చనీయాంశమైంది.
ఎన్నికలకు ముందు చప్పుడు చేయకుండా.. ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజీల్ ధరలు పెంచుతూ పోవడం పక్కా రాజకీయమేనన్నారు ఆయన. యుద్దం ఎంతకాలముంటుంది? దాని ప్రభావమెంత వరకు ఉంటుంది? దీన్ని బూచిగా చూపి… ధరలు పెంచడం.. పొదుపు చర్యలు పాటించండి.. అని జనానికేదో మెహర్బానీ చేసినట్టు చెప్పడం.. మంచి పద్దతి కాదనే విధంగా కౌంటర్ ఇచ్చారు రేవంత్. రాజకీయాలకు అనుకూలంగా కేంద్ర సర్కార్ కామెంట్లుంటున్నాయని, అవసరం తీరాక పొదుపు సుభాషితాలు వల్లెవేస్తున్నారనే రేవంత్ కామెంట్స్ రాజకీయ సర్కిళ్లలో చర్చకు తెరలేపింది. ఇప్పుడు మీరు చెప్పగానే ఒక్కసారిగా ప్రజలు తమ దినచర్యలను మార్చుకోవాలా? అని కూడా కేంద్రాన్ని నిలదీశారు రేవంత్. మేం రాజకీయాల కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేయబోమని మోడీకి చురకలు కూడా అంటించారు.
మా ఆలోచనలు, పథకాలు… సుధీర్ఘ కాలాన్ని దృష్టిలో పెట్టుకుని సాగుతాయని, ప్రజల భవిష్యత్తుకు ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత ప్రభుత్వాలదేనన్నారు. బాధ్యతల నుంచి తప్పించకునేందుకే పొదుపు మంత్రం జపిస్తున్నాడని పరోక్షంగా మోడీపై విమర్శలు ఎక్కుపెట్టారు రేవంత్. ఓ వైపు పక్క రాష్ట్రం ఏపీ..మోడీ చూపిన బాటలో పొదుపు చర్యలు పాటించేందుకు వీర స్వామిభక్తిని ప్రదర్శించింది ఇప్పటికే. పొదుపు విషయంలో సంస్కరణలు తీసుకొచ్చినంత రేంజ్లో నిర్ణయాలు తీసుకుని.. దేశానికే ఆదర్శంగా నిలిచామనిపించుకున్నది. మోడీ చేత షబ్బాష్ అని అనిపించుకోవడమే ఒక్కటే తక్కువైంది. కానీ తెలంగాణలో మాత్రం దీనికి డిఫరెంట్గా మోడీకే చురకలంటించి వదిలేశారు రేవంత్. బహుశా ఇలాంటి కామెంట్స్ ఏ రాష్ట్రం నుంచీ వచ్చి ఉండవు.. మోడీకి. తెలంగాణ బీజేపీ కూడా ఇక్కడి సర్కార్ కామెంట్స్కు అవాక్కయి ఉంటుంది. ఇప్పుడు ఈ డిస్కషన్ హాట్ టాపిక్గా మారింది.