Coimbatore: కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఒక కారు ఆగి ఉన్న లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురితో సహా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది.
పోలీసుల సమాచారం ప్రకారం.. పొల్లాచ్చి సమీపంలో రోడ్డు మధ్యలో మొక్కలకు నీళ్లు పోసే లారీ ఆగి ఉంది. అదే సమయంలో అతివేగంతో వచ్చిన కారు, ఊహించని విధంగా ఆ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం తీవ్రంగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్నవాళ్లు ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో నలుగురిని కోయంబత్తూరు జిల్లా మక్కరై సమీపంలోని గురుబాంపాలయంకు చెందిన ఒకే కుటుంబ సభ్యులుగా పోలీసులు గుర్తించారు. వారు కనగరాజ్, ఆయన భార్య నర్మద, వారి ఇద్దరు కుమార్తెలు ఆర్తి, పూరణి. ఈ ఘటనలో మరణించిన ఐదో వ్యక్తి ఎవరనేది తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Also Read: కారుతో మైనర్ బీభత్సం.. 7 బైకులు ధ్వంసం, ఇద్దరికి తీవ్ర గాయాలు!