Jhiram Ghati Verdict: 2013లో ఛత్తీస్గఢ్లోని జిరమ్ ఘాటి వద్ద మావోయిస్టులు జరిపిన భయానక దాడికి సంబంధించి కీలక తీర్పు వెలువడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దారుణ కాండలో 29 మంది ప్రాణాలు కోల్పోగా ఏకంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఘటన జరిగిన దాదాపు 13 ఏళ్ల తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కోర్టు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
2013 మే 25న కాంగ్రెస్ నాయకులు ‘పరివర్తన్ ర్యాలీ’ని ముగించుకుని తిరుగుపయనమయ్యారు. బస్తర్ జిల్లాలోని దర్భా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జిరమ్ ఘాటి జాతీయ రహదారిపై వారి కాన్వాయ్ వెళ్తుండగా మావోయిస్టులు ఒక్కసారిగా మెరుపు దాడి చేశారు. ఈ దారుణ ఘటనలో అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నంద్ కుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేష్, అసెంబ్లీలో మాజీ ప్రతిపక్ష నేత మహేంద్ర కర్మా, మాజీ కేంద్ర మంత్రి విద్యాచరణ్ శుక్లా, మాజీ ఎమ్మెల్యే ఉదయ్ ముద్లియార్ సహా పలువురు సీనియర్ నాయకులు దారుణంగా హత్యకు గురయ్యారు. నాయకులతో పాటు పలువురు భద్రతా సిబ్బంది, సాధారణ పౌరులు కలిపి మెుత్తం 29 మంది ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు.
దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం జగదల్పూర్లోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు స్పెషల్ జడ్జ్ అభయ్ సింగ్ రాజ్పుత్ ఇవాళ చారిత్రాత్మక తీర్పు వెలువరించారు. ఈ కేసు విచారణలో భాగంగా మొత్తం 101 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయగా వేలాది డాక్యుమెంట్లను కోర్టు పరిశీలించింది. అయితే ఈ నెల ప్రారంభంలోనే ఇద్దరు మహిళలతో సహా మొత్తం 10 మందిని దోషులుగా కోర్టు నిర్ధారించింది. బుధవారం వీరికి శిక్ష ఖరారు చేస్తూ 10 మంది దోషులకు మరణశిక్ష (ఉరిశిక్ష) విధిస్తూ తీర్పు ఇచ్చింది. దాంతో పాటు రూ. 800 చొప్పున జరిమానా న్యాయమూర్తి విధించారు. హైకోర్టు ఈ శిక్షను ఖరారు చేసే వరకు దోషులు సెంట్రల్ జైలులోనే ఉంటారని ఈ తీర్పుపై 30 రోజుల్లోగా హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసింది.
నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) సంస్థకు చెందిన సాయుధ కేడర్లు, స్థానిక డివిజన్లతో కలిసి పక్కా పథకం ప్రకారం ఈ దాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. కాంగ్రెస్ నాయకులను, వారి వెంట ఉన్న భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని అంతమొందించడమే ధ్యేయంగా ఈ క్రిమినల్ కుట్ర పన్నినట్లు స్పష్టమైంది. మావోయిస్టులు తమ ‘టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్’ (TCOC) లో భాగంగానే ఈ దాడికి ఒడిగట్టారని ఎన్ఐఏ తన దర్యాప్తు నివేదికలో వెల్లడించింది.
Also Read: కీబోర్డ్లో ‘స్పేస్ బార్’ అంత పెద్దగా ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు రహస్యం ఇదే!
ఈ తీర్పు వెలువడిన నేపథ్యంలో ఛత్తీస్గఢ్ రాజకీయం మళ్లీ వేడెక్కింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఈ కేసు విచారణపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ దాడి వెనుక పెద్ద వ్యక్తుల ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి (SIT) స్వతంత్రంగా విచారణ జరిపే అవకాశం ఇచ్చి ఉంటే ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులు బయటపడేవారని బఘేల్ అభిప్రాయపడ్డారు. అయితే బఘేల్ ఆరోపణలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. బీజేపీ మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ మాట్లాడుతూ.. బఘేల్కు ఈ కేసు విచారణపై గానీ, బాధితులకు న్యాయం జరగడంపై గానీ ఎలాంటి పట్టింపు లేదని విమర్శించారు. కేవలం ఈ విషయాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడమే ఆయన నైజమని రమణ్ సింగ్ ఆరోపించారు.
Also Read: పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే యాప్లకు ఆదాయం ఎలా వస్తుంది? వీటిలో ఏది బెస్ట్?