Himachal Congress Shock : హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ షాక్ ఇచ్చింది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 26 మంది నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. హిమాచల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధానకార్యదర్శి ధర్మపాల్ ఠాకూర్ తోపాటు 26మంది నేతలు బీజేపీ తీర్థం స్వీకరించారు.
హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాంఠాకూర్, బీజేపీ నేత సుధాన్ సింగ్, బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి, సిమ్లా బీజేపీ అభ్యర్థి సంజయ్ సూద్ ల సమక్షంలో పలువురు కాంగ్రెస్ నేతలు కాషాయ కండువాను కప్పుకున్నారు. బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేతలకు స్వాగతం పలికిన సీఎం జైరాం ఠాకూర్ ఎన్నికల్లో చారిత్రక విజయం కోసం తామంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. హిమాచల్ లో నవంబర్ 12వతేదీన పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 8వతేదీన ఓట్లను లెక్కించనున్నారు.