IMD Weather Alert: దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెండు భిన్నమైన హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు కాస్తాయని హెచ్చరిస్తే.. మరికొన్నింటిలో భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. అంతేకాదు రాబోయే రోజుల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయో ముందే అంచనా వేసింది. వాటికి అనుగుణంగా ప్రజలు, పర్యాటకులు జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికింది.
ఉత్తర, మధ్య భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలు ప్రస్తుతం తీవ్రమైన వడగాల్పుల గుప్పిట్లో ఉన్నాయని ఐఎండీ హెచ్చరించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, దిల్లీ, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రాబోయే కొన్ని రోజుల పాటు తీవ్రమైన ఎండలు కొనసాగుతాయని ఐఎండీ అభిప్రాయపడింది. ముఖ్యంగా దిల్లీ, ఆగ్రా, జైపూర్, ఖజురహో వంటి ప్రముఖ చారిత్రక ప్రాంతాలు సందర్శించాలనుకునే వారికి మధ్యాహ్నం పూట బయటకు రావడం కష్టంగా మారవచ్చని అభిప్రాయపడింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల నుండి 47 డిగ్రీలు దాటొచ్చని హెచ్చరించింది.
మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. కాబట్టి హిల్ స్టేషన్లకు వెళ్లాలనుకునే ప్రజలు, పర్యాటకులు చాలా జాగ్రత్తగా ఉండాలని హితవు పలికింది. అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, బెంగాల్ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఫలితంగా షిల్లాంగ్, చిరపుంజీ, గ్యాంగ్టక్, తవాంగ్, కాజీరంగా వంటి ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొండచరియలు విరిగిపడటం (Landslides), రోడ్లు సరిగ్గా కనిపించకపోవడం, ట్రాఫిక్ జామ్లు అయ్యే ప్రమాదం ఉండొచ్చని అంచనా వేసింది.
మరోవైపు దక్షిణాది రాష్ట్రాలకు సైతం కొన్ని సూచనలను ఐఎండీ చేసింది. దక్షిణాదిన వాతావరణం చల్లబడినప్పటికీ.. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది. కేరళ, కర్ణాటక తీరప్రాంతాలు, తమిళనాడు, లక్షద్వీప్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో తుఫాను గాలులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. కాబట్టి మున్నార్, వయనాడ్, కూర్గ్, ఊటీ వంటి హిల్ స్టేషన్లలోని రోడ్లు ప్రమాదకరంగా మారొచ్చని ఐఎండీ పేర్కొంది. ప్రస్తుత వేసవి నేపథ్యంలో పర్యాటకులను అక్కడి జలపాతాలు ఆకర్షించినప్పటికీ ప్రకృతి వైపరీత్యాల పట్ల జాగ్రత్త అవసరమని పేర్కొంది.
Also Read: సామాన్యులకు బంపరాఫర్.. BSNL కనీవినీ ఎరుగని ప్లాన్.. ఎగిరిగంతేయడం పక్కా!
ఇదిలా ఉంటే సముద్ర తీరాలు, ఐలాండ్ టూరిజం ప్లాన్ చేసుకునే వారికి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కేరళ, కర్ణాటక తీరాలు, లక్షద్వీప్, బంగాళాఖాతంలో రాబోయే రోజుల్లో గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేసింది. కాబట్టి సముద్రంలో ఆటుపోట్లు ఉండే ఛాన్స్ ఉన్నందువల్ల బోటింగ్, ఫెర్రీ ప్రయాణాలు, బీచ్ కార్యకలాపాలు, ఫిషింగ్పై ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: ఇది కదా ప్లాన్ అంటే.. రూ.79కే జియో అదిరిపోయే గిఫ్ట్.. నెలంతా ఎంజాయ్ పండగో!