Supreme Court: తెలుగు రాష్ట్రాలు సహా దేశంలో స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (SIR) ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్న వేళ దీనికి సంబంధించి సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఎన్నికల సంఘానికి లేదని స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ విషయాన్ని తేల్చి చెప్పింది. ఎన్నికల కమిషన్ కు కేవలం ఓటర్ల జాబితాపై మాత్రమే అధికారం ఉంటుందని పేర్కొంది. ఓటరు జాబితాలో పేరు లేనంత మాత్రం పౌరసత్వం పోదని స్పష్టం చేసింది.
వెస్ట్ బెంగాల్ లో జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రసేన్జిత్ బోస్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించినంత మాత్రాన ప్రజా పంపిణీ వ్యవస్థ, అన్నపూర్ణ పథకం, ఆర్థిక, సామాజిక ప్రయోజనాలు అందించే ఇతర సంక్షేమ పథకాల నుంచి వారిని మినహాయించకూడదని పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.
బీహార్ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఇప్పటికే ఈ అంశంపై స్పష్టతనిచ్చిందని ధర్మాసనం గుర్తుచేసింది. తమకు ఈ విషయంపై అవగాహన ఉందని.. బీహర్ ఎస్ఐఆర్ తీర్పులో ఓటింగ్ హక్కులపై ఈసీఐ నిర్ణయం తీసుకున్నంత మాత్రాన అది పౌరసత్వాన్ని నిర్దారించలేదని స్పష్టం చేశామంది. పౌరసత్వ చట్టం కింద ఈ విషయాన్ని తుది పరిష్కారం కోసం సంబంధిత మంత్రిత్వ శాఖకు నివేదించాల్సిన బాధ్యత మాత్రమే ఈసీఐకి ఉందని పేర్కొంది.
Also Read: రైతులపై కక్షనా? బీఆర్ఎస్ పార్టీపై కక్షనా? కాంగ్రెస్పై శ్రీనివాస్ గౌడ్ ఫైర్!
చట్టపరంగా పరిస్థితి ఇలా ఉన్నా బాధితులు మాత్రం ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారని పిటిషనర్ తరపు న్యాయవాది శంకర నారాయణన్ వాదించారు. ఈ సంక్షేమ పథకాల నుంచి వారిని తొలగిస్తారని ఊహించలేదని చెప్పారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు కేంద్ర ఎన్నికల సంఘం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 25వ తేదీకి వాయిదా వేసింది.
Also Read: ఫ్రీ వైఫై వాడుతున్నారా? పాస్వర్డ్లు ఒకటే పెట్టారా? అయితే మీ సేవింగ్స్ గోవిందా!