Bargi Dam boat accident: మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లా బర్గి డ్యామ్ (నర్మదా నది)లో జరిగిన ఘోర పడవ ప్రమాదం యావత్ దేశాన్ని కలచివేసింది. ఈ దుర్ఘటనలో వెలుగులోకి వచ్చిన ఒక దృశ్యం ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది. పడవ మునిగిపోతున్న సమయంలో ఒక తల్లి తన ప్రాణాలను పణంగా పెట్టి కన్న బిడ్డను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలమై.. చివరకు ఇద్దరూ మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు. సహాయక బృందాలు గాలింపు చేపట్టినప్పుడు.. లైఫ్ జాకెట్ ధరించిన ఆ తల్లి తన బిడ్డను గుండెలకు గట్టిగా హత్తుకుని ప్రాణాలు వదిలిన స్థితిలో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆ తల్లి చేతుల్లోనే ఆ పసికందు ఊపిరి ఆగిపోవడం చూసి రెస్క్యూ సిబ్బంది సైతం కన్నీటి పర్యంతమయ్యారు.
ఏప్రిల్ 30న సాయంత్రం వేళ చోటుచేసుకున్న ఈ ప్రమాదానికి ప్రకృతి వైపరీత్యంతో పాటు మానవ తప్పిదాలు కూడా తోడయ్యాయి. సుమారు 40 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన ఈదురుగాలులు.. హఠాత్తుగా వచ్చిన తుపాను కారణంగా మధ్యప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్కు చెందిన క్రూయిజ్ బోటు ఖమరియా ద్వీపం సమీపంలో అదుపుతప్పి మునిగిపోయింది. ఆ సమయంలో బోటులో సిబ్బందితో కలిపి మొత్తం 29 మంది ఉన్నట్లు సమాచారం. ఈ విషాదంలో ఇప్పటివరకు 9 మంది మరణించగా.. 15 మందిని సహాయక బృందాలు సురక్షితంగా కాపాడాయి. ఇంకా కొందరు గల్లంతు కావడంతో ఎస్డీఆర్ఎఫ్ (SDRF), ఎన్డీఆర్ఎఫ్ (NDRF) మరియు ఆర్మీ బలగాలు సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
#HEARTBREAKING : Mother Dies Holding Son in Bargi Dam Tragedy
Rescue teams at Bargi Dam recovered a deeply moving scene from the wreckage of the capsized cruise boat, the body of a woman still holding her child in a tight embrace.
The tragic image has come to define the scale… pic.twitter.com/34Nm34KCNH
— upuknews (@upuknews1) May 1, 2026
ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు బోటులోని ప్రయాణికులు రికార్డు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఈదురుగాలులు ఎంత బలంగా వీస్తున్నాయో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వీడియోలో ఉన్న ప్రయాణికులలో ఒక్కరు కూడా లైఫ్ జాకెట్లు ధరించలేదు. వాతావరణం అనుకూలించడం లేదని.. పడవను పక్కకు తప్పించాలని ప్రయాణికులు డ్రైవర్ను ప్రాధేయపడినా అతను నిర్లక్ష్యం వహించాడని ప్రాణాలతో బయటపడిన వారు ఆరోపిస్తున్నారు. భద్రతా నియమాలను తుంగలో తొక్కడం వల్లే ఇన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదం జరిగిన తీరుపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. టూరిజం బోటులో కనీస భద్రతా ప్రమాణాలు ఎందుకు పాటించలేదు? లైఫ్ జాకెట్లు ఉన్నా వాటిని ప్రయాణికులకు ఎందుకు వేయించలేదు? అనే కోణంలో విచారణ జరుగుతోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
A tragic accident took place near Bargi Dam in Jabalpur, where a cruise boat capsized due to sudden bad weather and strong winds.
Just moments before the incident, people were enjoying the ride, unaware of the danger. Reports say many passengers were not wearing life jackets… pic.twitter.com/5oPuEo8JVv
— Pawan Goswami (@PawanGoswami011) May 1, 2026