Government Teachers: పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుల్లో కొందరు దారి తప్పుతున్నారు. ప్రభుత్వం నుంచి నెలకు లక్షల్లో జీతాలు తీసుకుంటూ.. బడి బాట పట్టడం మానేసి సొంత వ్యాపారాల్లో మునిగితేలుతున్నారు. బిగ్ టీవీ (Big TV) సంపాదించిన సమాచారం ప్రకారం.. ప్రభుత్వ ఉపాధ్యాయుల తీరుపై కలెక్టర్ ఆదేశాలతో జరిగిన విచారణ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
విచారణలో దిగ్భ్రాంతికర నిజాలు
2018-19 కాలంలో ఆర్డీవో ఆధ్వర్యంలో జరిగిన సమగ్ర విచారణలో ఏకంగా 29 మంది ఉపాధ్యాయులు అక్రమంగా సొంత వ్యాపారాలు నడుపుతున్నట్లు అధికారికంగా నమోదైంది. వీరు కేవలం చిన్నపాటి వ్యాపారాలకే పరిమితం కాకుండా ఫైనాన్స్, చిట్టీలు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ప్రైవేట్ స్కూళ్లు, ఆన్లైన్ కోచింగ్ సెంటర్ల వరకు వివిధ రంగాల్లో ఏజెంట్లుగా, భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది.
హాజరు వేసి.. బడికి ఎగ్గొట్టి!
పాఠశాలల తనిఖీలు సక్రమంగా లేకపోవడాన్ని కొందరు ఉపాధ్యాయులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎస్ఆర్ఎస్ లేదా బయోమెట్రిక్ లో హాజరు నమోదు చేసి.. ఆ తర్వాత పాఠశాలల నుంచి ముఖం చాటేస్తున్నారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. మరికొందరైతే ఏకంగా సిక్ లీవ్లు, మెడికల్ లీవ్లు, లాస్ ఆఫ్ పే పేర్లతో నెలల తరబడి లీవులు పెట్టి తమ సొంత రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ ధ్యాసలోనే గడుపుతున్నారు. గతంలో విచారణ అనంతరం కొందరిని వేరే ప్రాంతాలకు బదిలీ చేసినప్పటికీ, వారు ఇప్పటికీ అదే నిర్లక్ష్యంతో విధుల్లో కొనసాగుతుండటం గమనార్హం.
విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం
ఉపాధ్యాయుల ఈ బాధ్యతారాహిత్యం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. తరగతులకు ఉపాధ్యాయులు సరిగ్గా రాకపోవడంతో వార్షిక ఫలితాలు దెబ్బతింటున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధులను గాలికొదేసి వ్యాపారాలు చేసుకుంటున్న ఇలాంటి ఉపాధ్యాయులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
Also Read: పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. నియామక ప్రక్రియపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం!