Bengaluru: దేవుడు వరాలు గానీ.. శాపాలు గానీ ఇవ్వడన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఆయన కేవలం అవకాశాలు మాత్రమే ఇస్తాడని మనసులోని మాట బయటపెట్టారు. ఆ అవకాశంలో మనం ఏమి సాధించామన్నదే ముఖ్యమన్నారు. అందుకు మన సిద్ధరామయ్య ఉదాహరణగా చెప్పుకొచ్చారు.
మాజీ సీఎం సిద్దరాయమ్య కోసం నాలుగు మాటలు చెప్పిన డీకే
మైసూరు జిల్లాలోని ఒక గ్రామంలో పుట్టి పెరిగిన ఆయన, పోరాటం ద్వారా రాజకీయాల్లోకి వచ్చారన్నారు. సాంఘిక న్యాయానికి మార్గ దర్శకుడిగా, పేదల మిత్రుడిగా కర్ణాటక ముఖ్యమంత్రిగా సేవలందించిన నా ప్రియ మిత్రుడు సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారని తెలిపారు.
కర్ణాటక రాజకీయ చరిత్రలో అత్యంత విజయవంతమైన, ప్రభావవంతమైన, సుదీర్ఘకాలం పని చేసిన సీఎంగా ఆయన ప్రజల మనసులో నిలిచిపోయారని చెప్పుకొచ్చారు. దేశ రాజకీయాల్లో దిగ్గజ నాయకుడి నిలిచిపోయారని తెలిపారు. ప్రజాహిత ప్రాజెక్టుల వరకు రాష్ట్రంలో వివిధ రంగాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేనివని తెలిపారు.
శనివారం సాయంత్రం కర్ణాటక సీఎల్పీ భేటీ, డీకే ఎన్నిక లాంఛనమే
ఆయన 50 ఏళ్ల అపారమైన రాజకీయ అనుభవం, సాంఘిక స్పృహ, ప్రజాహిత ప్రాజెక్టులు ఎల్లప్పుడూ స్మరణీయమన్నారు. ఆరేళ్ల కిందట అంటే 2020లో తాను కేపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన రోజు నుండి ఇవాళ్టివరకు సిద్ధరామయ్య పార్టీ సంస్థలో తనకు భుజం భుజం కలిపి నిలిచారని చెప్పుకొచ్చారు.
ఆయన పాలనలో మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా మార్గదర్శకత్వం పొందే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, పార్టీ బలోపేతం కోసం ఆయన మార్గదర్శకత్వం, సీనియర్ అనుభవం రాబోయే రోజుల్లో మనకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నానని వెల్లడించారు. కర్ణాటక ప్రగతి కోసం మనమందరం కలిసి నడుద్దామంటూ ముగించారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.
ALSO READ: నైరుతి రుతుపవనాలు రాక మరింత ఆలస్యం.. జూన్ తొలివారానికి, ఇకపై దంచి కాయనున్న ఎండలు
మరోవైపు శుక్రవారం గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ సీఎం సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించారు. దీంతో ఆయన మంత్రివర్గం తక్షణమే రద్దు అయ్యింది. కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ పక్షం శనివారం సమావేశం కానుంది. తమ కొత్త నాయకుడిని శనివారం సాయంత్రం 4 గంటలకు ఎన్నుకోనుంది.
ఈ సమావేశంలో డీకే శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రిగా లాంఛనంగా ప్రకటించే అవకాశం ఉంది. మాజీ సీఎం సిద్దరామయ్య ఆదేశాల మేరకు ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించనున్నారు. కర్ణాటక కాంగ్రెస్ ఇన్ఛార్జ్,సీనియర్ నాయకుడు రణదీప్ సింగ్ సుర్జేవాలా హాజరయ్యే అవకాశం ఉంది.