Weather Updates: దేశంలో మరో వారంరోజులపాటు భానుడు ప్రతాపం చూపనున్నాడు. ఎందుకంటే నైరుతి రుతుపవనాలు ఈసారి ముఖం చాటేశాయి. వాతావరణంలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో రుతుపవనాల రాక మరోవారం పాటు ఆలస్యమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
నైరుతి రుతుపవనాలు రాక మరింత ఆలస్యం
దేశంలో మే 25 నుంచి రోహిని కార్తె ప్రారంభమైంది. దాదాపు 14 రోజులపాటు ఈ కార్తె ఉండనుంది. రోహిణి కార్తె గురించి చెప్పనక్కర్లేదు. రోళ్లు బద్దలయ్యేలా ఎండలు కాస్తాయని పంచాంగాలు చెబుతున్నాయి. దేశంలో ఇప్పుడు అదే పరిస్థితి నెలకుంటుంది. ఎందుకంటే ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఉపశమనం కనిపించలేదు.
మే 26 నాటికి కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకుతాయని ఐఎండీ అంచనా వేసింది. ఇప్పుడు రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుంది. జూన్ ఫస్ట్ వీక్ అంటే నాలుగు లేదా ఐదు నాటికి రుతుపవనాలు కేరళం తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేసింది వాతావరణ శాఖ.
జూన్ తొలి వారానికే.. దంచి కాయనున్న ఎండలు
ఎల్నినో ప్రభావంతో రుతుపవనాలు రాక మరింత ఆలస్యమయ్యాయి. గడిచిన పదేళ్లలో పరిశీలిస్తే ఐఎండీ అంచనాలు మరోసారి తారుమారు అయ్యాయి. కేరళను తాకిన మూడు రోజులకు తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
కేరళాకు రుతుపవనాలు రాక ఆలస్యం కావడంతో ఉత్తర భారత్కు మరింత లేటు కానుంది. ఆ లెక్కన జూన్ చివరి నాటికి ఢిల్లీకి నైరుతి రుతుపవనాలు చేరుకునే అవకాశం ఉంది. ప్రారంభంలో నెమ్మదిగా సాగిన రుతుపవనాలు ఆ తర్వాత వేగంగా ముందుకు సాగవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ALSO READ: వ్యభిచారం నేరం కాదు.. సె*క్స్ వర్కర్లను అరెస్టు చేయెుద్దు.. సుప్రీంకోర్టు సంచలనం
నైరుతి రుతుపవనాలు ఈసారి బలహీనంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తన నివేదికలో ప్రస్తావించింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వర్షపాతం సగటున కేవలం 90 శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొంది. ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం కేటగిరీ లోకి వస్తుందని భావిస్తోంది. వ్యవసాయం, జలవనరులు, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఈశాన్య భారతంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక వాయువ్య, మధ్య, దక్షిణ భారత్లో లోటు వర్షపాతం నమోదు అవుతుందని తెలిపింది. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం కురిసే అవకాశముందని తెలియజేసింది.