Delhi: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీ మార్పులు జరగనున్నాయా? ముఖ్యమంత్రి పీఠంపై లొల్లి ఇంకా కొనసాగుతోందా? ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హస్తినకు వెళ్లారా? మంగళవారం కాంగ్రెస్ పెద్దలతో ఇరువురు నేతలు భేటీ కానున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
కర్ణాటక అధికార ప్రభుత్వంలో భారీ మార్పులు?
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఖాయమంటూ గడిచిన ఏడాదిగా ప్రచారం సాగుతోంది. తాను సీఎం పీఠం వదిలేది లేదని తెగేసి చెబుతున్నారు సిద్ధరామయ్య. అయినా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెనక్కి తగ్గలేదు. తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకెలు సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు.
మంగళవారం కాంగ్రెస్ పెద్దలతో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకేలు సమావేశం కానున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం డీకేలు సైలెంట్గా పావులు కదిపారు. ముందుగా నిర్ణయించుకున్న ఒప్పందం ప్రకారం మిగిలిన రెండున్నరేళ్లు శివకుమార్ను సీఎం చేయాలని డీకే వర్గం పట్టుబడుతోంది.
హస్తినకు చేరుకున్న సీఎం- డిప్యూటీ సీఎంలు.. కాంగ్రెస్ పెద్దలతో భేటీ
ఢిల్లీకి చేరుకున్న సీఎం సిద్ధరామయ్య ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అధిష్టానం పిలవడంతోనే తాను ఢిల్లీ వచ్చానని తెలిపారు. ఎందుకు పిలిచారో తనకు తెలియదన్నారు. సీఎం సిద్ధరామయ్యతోపాటు ఢిల్లీ చేరుకున్నారు కర్ణాటక హోం మంత్రి పరమేశ్వరన్. ఏది ఏమైనా కాంగ్రెస్ హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను కట్టుబడి ఉంటానని బహిరంగంగా చెబుతున్నారు సీఎం.
సీఎంగా తాను తప్పుకోవాల్సి వస్తే పరమేశ్వరన్ను తదుపరి సీఎం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ వద్ద సిద్ధరామయ్య ప్రతిపాదించే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతోంది. అటు డీఎం వర్గం మాత్రం కచ్చితంగా సీఎం మార్పు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది.
ALSO READ: పళనిస్వామికి బిగ్ షాక్.. ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా.. ఎందుకంటే?
సీఎం మార్పు, మంత్రివర్గ విస్తరణ, రాజ్యసభ ఎంపీల ఎంపికపై అధిష్టానం పెద్దలను కలిసి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ కర్ణాటకపై ఫోకస్ చేసింది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంపై సిద్ధరామయ్య-డీకే వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. గత వారం డిప్యూటీ సీఎం శివకుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన మద్దతుదారులు కాంగ్రెస్ కార్యాలయాల వద్ద తదుపరి ముఖ్యమంత్రి అంటూ పోస్టర్లు పెట్టిన విషయం తెల్సిందే.