Techie Drowned: నోయిడాలో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన వ్యవస్థల నిర్లక్ష్యాన్ని, మానవత్వపు మృత్యువును కళ్లకు కడుతోంది. దట్టమైన పొగమంచు ప్రాణసంకటంగా మారి ఒక యువ టెక్కీని బలితీసుకోగా, సాయం కోసం అతను చేసిన ఆర్తనాదాలు అధికారుల చెవులకు చేరకపోవడం విచారకరం. సుమారు రెండు గంటల పాటు మృత్యువుతో పోరాడి, కళ్లముందే పోలీసులు ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ యువకుడు జలసమాధి అయిన తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా ఈ ఘటనలో మరిన్ని దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
“నా కొడుకు సాయం కోసం ఏడుస్తున్నా అక్కడ ఉన్న జనం కేవలం చూస్తూ నిలబడ్డారు, కొందరైతే వీడియోలు తీశారు” అని తండ్రి రాజ్కుమార్ మెహతా కన్నీరుమున్నీరయ్యారు. కారు డ్రైనేజీలో పడిపోయిన తర్వాత యువరాజ్ దాని పైకప్పు మీదకు ఎక్కి సుమారు రెండు గంటల పాటు (అర్ధరాత్రి 12 నుండి 2 గంటల వరకు) సాయం కోసం అరిచాడు. కారు మునిగిపోకుండా ఉండేందుకు తన శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూనే ఉన్నాడని యువరాజ్ తండ్రి వాపోయారు. దట్టమైన పొగమంచు వల్ల తాను ఎక్కడున్నానో ఎవరికీ కనిపించకపోవడంతో, తన ఫోన్ టార్చ్లైట్ వేసి రక్షక సిబ్బందికి సంకేతాలు ఇచ్చాడని తెలిపారు.
“అక్కడ వందలాది మంది ఉన్నా, పోలీసులు వెనకాడుతున్నా.. మోనిందర్ అనే ఫ్లిప్కార్ట్ డెలివరీ ఏజెంట్ మానవత్వాన్ని చాటుకున్నాడు. తన నడుముకు తాడు కట్టుకుని ఆ లోతైన డ్రైనేజీలోకి దూకి యువరాజ్ను కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది.” అని కన్నీరుమున్నరయ్యీరు.
ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో నోయిడా అథారిటీ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఒక జూనియర్ ఇంజనీర్ను విధుల నుండి తొలగించారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ భద్రత, లైటింగ్ పర్యవేక్షించాల్సిన ఇతర అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆ భూమి ఎవరికి కేటాయించారు? అక్కడ బారికేడ్లు ఎందుకు లేవు? అనే అంశాలపై సమగ్ర విచారణకు ఆదేశించారు.
Read Also: “కాపాడమని రెండు గంటలు అరిచినా.. చూస్తూ నిలబడ్డారు”: నోయిడా డ్రైనేజీలో టెక్కీ మృతి!