Techie Death: నోయిడాలో మనసును కలచివేసే ఘోర విషాదం చోటుచేసుకుంది. సాయం కోసం రెండు గంటల పాటు ఆర్తనాదాలు చేసినా, పోలీసులు చూస్తూ నిలబడటంతో ఒక యువ టెక్కీ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నోయిడాలోని సెక్టార్ 150లో శనివారం తెల్లవారుజామున జరిగింది.
యువరాజ్ మెహతా (27), గుర్గావ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో యువరాజ్ కారులో ఇంటికి వస్తుండగా, దట్టమైన పొగమంచు వల్ల దారి సరిగ్గా కనిపించలేదు. డ్రైనేజీ వద్ద సరిహద్దు గోడ దెబ్బతిని ఉండటంతో కారు అదుపు తప్పి సుమారు 70 అడుగుల లోతు ఉన్న డ్రైనేజీ కాలువలో పడిపోయింది.
కారు మునిగిపోతుండగా యువరాజ్ ఎలాగోలా బయటకు వచ్చి కారు పైకప్పు మీదకు ఎక్కాడు. వెంటనే తన తండ్రి రాజ్ మెహతాకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. 6 అడుగుల ఎత్తు, దృఢమైన శరీరం ఉన్నా అతనికి ఈత రాకపోవడంతో అక్కడే ఉండిపోయాడు.
యువరాజ్ స్నేహితుడు పంకజ్, ప్రత్యక్ష సాక్షి మోనిందర్ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నా, నీళ్లు చల్లగా ఉన్నాయని, లోపల ఇనుప రాడ్లు ఉండవచ్చని సాకులు చెబుతూ ఎవరూ నీటిలోకి దిగలేదు. అర్ధరాత్రి 12:30 నుండి 2:30 గంటల వరకు యువరాజ్ సాయం కోసం అరుస్తూనే ఉన్నాడు. పోలీసులు క్రేన్లు, తాళ్లు తెప్పించినా ప్రాణాలు కాపాడే సాహసం ఎవరూ చేయలేదని స్నేహితులు ఆరోపిస్తున్నారు.
ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు తెల్లవారుజామున 2:30 గంటలకు చేరుకున్నాయి. వారు నీటిలోకి దిగేసరికి యువరాజ్ అరుపులు ఆగిపోయాయి. డ్రైనేజీ వద్ద గోడ దెబ్బతిన్న విషయంపై నోయిడా అథారిటీకి ముందే ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని మృతుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రిఫ్లెక్టర్లు కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు.
పొగమంచు వల్ల యువరాజ్ ఎక్కడున్నాడో కనిపించలేదని, సహాయక బృందాలు వచ్చేసరికి ఆలస్యం అయిందని పోలీసులు చెబుతున్నారు. యువరాజ్ తల్లి రెండేళ్ల క్రితమే మరణించింది. తండ్రికి తనే ఏకైక ఆధారం. సంపాదించే వ్యక్తిని కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఈ ఘటనపై నోయిడా అథారిటీకి మెమోరాండం పంపుతామని పోలీసులు తెలిపారు.
Read Also: ఆస్తి సెటిల్మెంట్ అని పిలిచి.. తమ్ముడిని చంపిన అన్న!