West Bengal Jhalmuri: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జయ కేతనం ఎగరవేసింది. ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో జాల్ముడి (మరమరాలు) ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బెంగాల్ గెలుపును పురస్కరించుకుని ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులకు జాల్ముడిని అల్పాహారంగా ఏర్పాటు చేశారు. ప్రధాని ఇష్టపడి తిన్న వంటకాన్ని తాము విజయోత్సవంలో పంచుకుంటున్నామని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. మమతా బెనర్జీ విమర్శలకు ప్రజలు తమ ఓట్ల ద్వారా సమాధానం చెప్పారని వారు కౌంటర్ ఇచ్చారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రోడ్డు పక్కన ఆగి జల్ముడిని ఆస్వాదించడంపై మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఇదంతా ఒక పెద్ద డ్రామా అని.. పూర్తిగా ముందుగా రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల వేళ ప్రజలను ఆకర్షించేందుకు బీజేపీ ఇటువంటి విన్యాసాలు చేస్తోందని ఆమె ఎద్దేవా చేశారు.
ప్రధాని మోదీ రోడ్డు పక్కన ఆగిన వెంటనే అక్కడ కెమెరా ఎలా సిద్ధంగా ఉందో చెప్పాలని మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన ఘటన కాదన్నారు. ముందే ప్లాన్ చేసి షూట్ చేసిన సీన్ లా ఉందని ఆమె విమర్శించారు. సాధారణంగా ప్రధాని భద్రత మధ్య రోడ్డు పక్కన ఆహారం తీసుకోవడం వెనుక రాజకీయం దాగి ఉందని మండిపడ్డారు. బెంగాలీ సంస్కృతిలో భాగమైన జల్ముడిని ప్రధాని కేవలం ఓట్ల కోసమే వాడుకున్నారని ఆమె ఆరోపించారు.
జల్ముడి తిన్న తర్వాత ప్రధాని తన నెహ్రూ జాకెట్ జేబులోంచి పది రూపాయల నోటు తీసి చెల్లించడంపై కూడా దీదీ సందేహాలు వ్యక్తం చేశారు. ప్రధాని ఎప్పుడూ తన వెంట నగదు ఉంచుకోరని.. ఆ పది రూపాయల నోటు కూడా కేవలం ఫొటోల కోసమే ముందుగా సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. బెంగాల్ ప్రజలు అమాయకులు కాదని.. ఇలాంటి నాటకాలను వారు నమ్మరని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
చిన్న మరమరాల మిశ్రమం చుట్టూ ఇంత పెద్ద ఎత్తున రాజకీయ యుద్ధం జరగడం జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ తన సొంత వంటకంగా భావించే జల్ముడిని బీజేపీ తన విజయానికి చిహ్నంగా మార్చుకోవడాన్ని దీదీ జీర్ణించుకోలేకపోతున్నారు. బెంగాలీ ప్రజల మనసు గెలుచుకోవడంలో జల్ముడి ఒక ఆయుధంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: ఫలితాల వేళ మమతా బెనర్జీ సంచలన వీడియో.. తుది ఫలితాలు మారుతాయంటున్న దీదీ