Dump Yard Issue: హైదరాబాద్ శివార్లలోని జవహర్ నగర్ డంప్ యార్డ్ సమస్య పరిష్కారమే లక్ష్యంగా ‘యాంటీ జవహర్ నగర్ డంప్ యార్డ్’ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) నాయకులు కీలక అడుగు వేశారు. జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ఈ భేటీలో రాజకీయాలకు అతీతంగా పలు పార్టీల నాయకులు పాల్గొనడం గమనార్హం. ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డితో పాటు JAC కన్వీనర్ శంకర్ నారాయణ్ తదితరులు ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
డంప్ యార్డ్ తరలింపే ఏకైక మార్గం..
దశాబ్దాలుగా జవహర్ నగర్ ప్రాంత వాసులు డంప్ యార్డ్ వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని JAC నాయకులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. యార్డ్ నుండి వెలువడుతున్న విష వాయువులు, కలుషితమైన భూగర్భ జలాలు స్థానిక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం నిర్వహణ పద్ధతులు మార్చడం వల్ల ప్రయోజనం లేదని, ఆ డంప్ యార్డును అక్కడి నుంచి పూర్తిగా వేరే ప్రాంతానికి తరలించాలని వారు విజ్ఞప్తి చేశారు.
సానుకూలంగా స్పందించిన సీఎం..
ప్రజాప్రతినిధులు, JAC నాయకులు వివరించిన సమస్యలను విన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో సానుకూలంగా స్పందించారు. నగర ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ తమ ప్రభుత్వ ప్రాధాన్యతని పేర్కొంటూ, ఈ సమస్యపై ఉన్నతాధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ భేటీతో జవహర్ నగర్ వాసుల్లో తమ కష్టాలు త్వరలోనే తీరుతాయనే కొత్త ఆశలు చిగురించాయి.
Also Read: కేరళ రాజకీయాల్లో రేవంత్ సెగ.. విజయన్ పాలనకు ఎక్స్పైరీ డేట్ ముగిసింది!
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన యాంటీ జవహర్ నగర్ డంప్ యార్డ్ JAC
సీఎంను కలిసిన ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు
జవహర్ నగర్ డంప్ యార్డును తరలించాలాలని సీఎంకు JAC నాయకుల విజ్ఞప్తి
Anti-Jawahar Nagar Dump Yard JAC Meets CM Revanth… pic.twitter.com/HnzkYTAJJH
— BIG TV Breaking News (@bigtvtelugu) May 4, 2026